Rohini Commission : ఓబీసీ ఉప వర్గీకరణపై నివేదిక
ABN, First Publish Date - 2023-08-02T04:15:02+05:30
ఇతర వెనకబడిన తరగతుల (ఓబీసీ) ఉపవర్గీకరణపై అధ్యయనానికి ఏర్పాటైన రోహిణి కమిషన్ ఎట్టకేలకు రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీ రోహిణి ..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన జస్టిస్ రోహిణి కమిషన్
దాదాపు ఆరేళ్ల అధ్యయనం తర్వాత..
13 సార్లు గడువు పొడిగింపు
25 శాతం కులాలకే 97 శాతం ఉద్యోగాలు
లభిస్తున్నట్లు 2018 నాటి పరిశీలనలో వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఇతర వెనకబడిన తరగతుల (ఓబీసీ) ఉపవర్గీకరణపై అధ్యయనానికి ఏర్పాటైన రోహిణి కమిషన్ ఎట్టకేలకు రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీ రోహిణి చైర్పర్సన్గా 2017 అక్టోబరు 2న ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి 13 సార్లు కమిషన్ గడువును కేంద్రం పొడిగించింది. తాజా గడువు జూలై 31తో ముగియనుండగా అదే రోజున రాష్ట్రపతికి కమిషన్ తన నివేదికను అందజేసింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయశాఖ ఒక ప్రకటన చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నివేదిక రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో ఓబీసీలకు 27ు రిజర్వేషన్ ఉంది. అయితే, కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్న 2,600 కులాల్లో కొన్నే ఈ రిజర్వేషన్ లబ్ధిని అధికంగా పొందుతున్నాయన్న అభిప్రాయం చాలాకాలంగా ఉంది. రిజర్వేషన్ ఫలాలు సమానంగా పంపిణీ అయ్యేలా ఓబీసీ కోటాలో ఉప వర్గీకరణ చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రోహిణి కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేసింది. కమిషన్కు కొన్ని మార్గదర్శకాలను పొందపరిచింది. అవి, 1. ఓబీసీలలో రిజర్వేషన్ ప్రయోజనాల అసమాన పంపిణీ ఏ మేరకు ఉందో అధ్యయనం చేయటం 2. ఓబీసీలలో శాస్త్రీయంగా ఉపవర్గీకరణ చేయటానికి అవసరమైన యంత్రాంగం, ప్రాతిపదిక, పద్ధతులు, ప్రమాణాలను నెలకొల్పటం 3. ఒకే విధమైన ఉపకులాలను గుర్తించి, ఆ మేరకు వేర్వేరు తరగతులుగా ఓబీసీ కులాలను వర్గీకరించటం. కమిషన్ను తొలుత ఏర్పాటు చేసినప్పుడు 12 వారాల గడువు ఇచ్చారు. 2018 జనవరి 3తో ఆ గడువు ముగిసినప్పటికీ అప్పటి నుంచీ పలుమార్లు గడువు పొడిగించారు. ఓబీసీల జనగణనపై అఖిల భారత స్థాయిలో సర్వే చేపట్టటానికి వీలుగా బడ్జెట్ కేటాయించాలని 2018 డిసెంబరు 12న కేంద్రానికి కమిషన్ లేఖ రాసింది. 2019 జూలై 30న కమిషన్ ప్రభుత్వానికి మరో లేఖ రాస్తూ.. తమ నివేదిక ముసాయిదా సిద్ధమైందని, అయితే, కేంద్ర ఓబీసీ జాబితాలో ఎన్నో అస్పష్టతలు ఉన్నాయని, వర్గీకరణ జరగటానికన్నా ముందే వాటిని సవరించాలని ఆ లేఖలో పేర్కొంది. ఈ విధంగా ఓబీసీ జనాభాపై స్పష్టత లేనప్పటికీ, రోహిణి కమిషన్ చివరికి నివేదిక సమర్పించింది.
కొన్ని కులాలకే
ఫలాలు 2018లో రోహిణి కమిషన్ అంతకుముందు ఐదేళ్లలో నియమితులైన 1.3 లక్షల కేంద్రప్రభుత్వ ఓబీసీ ఉద్యోగుల వివరాలను పరిశీలించింది. అలాగే 2018కి ముందు మూడేళ్లలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థల్లో, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఓబీసీ అడ్మిషన్లను కూడా పరిశీలించింది. కమిషన్ పరిశీలనలో వెల్లడైన అంశాలపై పలు విశ్లేషణలు అప్పట్లోనే వెలువడ్డాయి. వాటి ప్రకారం..
97% ఉద్యోగాలు, విద్యావకాశాలు ఓబీసీల్లోని 25% కులాలకే దక్కుతున్నాయి. కేవలం పది కులాలకు 24.95% ఉద్యోగాలు లభిస్తున్నాయి.
దాదాపు 983 కులాలకు (మొత్తం ఓబీసీల్లో 37 శాతం) విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేదు.
994 కులాలకు విద్య, ఉద్యోగాల్లో 2.68 శాతం ప్రాతినిధ్యమే ఉంది. అయితే, ఓబీసీల జనాభా వివరాలు లేనందున ఈ విశ్లేషణ ఏ మేరకు శాస్త్రీయమైనదన్న సందేహాలు ఉన్నాయి.
Updated Date - 2023-08-02T06:15:08+05:30 IST