Operation Hidma: ఆపరేషన్ హిడ్మా!
ABN, First Publish Date - 2023-01-12T05:04:49+05:30
దండకారణ్యంలో పోలీసులకు సవాల్గా మారిన మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిద్ముల్లా టార్గెట్గా పోలీసులు స్పెషల్ ఆపరేషన్ను చేపట్టారు.
హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా వేట.. చిక్కినట్లే చిక్కి.. తప్పించుకున్న హిడ్మా?.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నక్సల్స్, పోలీసులకు మధ్య కాల్పులు
పాతికేళ్లుగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్.. తలపై రూ.45లక్షల రివార్డు
హిడ్మా స్కెచ్ వేస్తే..
2007లో సుక్మా జిల్లా ఉర్పల్మెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి, హతమార్చాడు
2010లో తడ్మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు
2013లో జీరామ్ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర
2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చాడు
2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతిచెందారు మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నాడు
భూపాలపల్లి, చర్ల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): దండకారణ్యంలో పోలీసులకు సవాల్గా మారిన మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిద్ముల్లా టార్గెట్గా పోలీసులు స్పెషల్ ఆపరేషన్ను చేపట్టారు. భద్రాద్రి జిల్లా చర్ల మండల సరిహద్దులోని.. ఛత్తీ్సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చింతల్నార్కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలౌరీ అడవుల్లో హిడ్మా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఓ బృందం బుధవారం సాయంత్రం హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టింది. ఈ క్రమంలో హెలికాప్టర్ యాంపురం గ్రామం సమీపంలోని అడవుల వద్దకు చేరుకోగానే.. కింది నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. హెలికాప్టర్లో ఉన్న సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఆ సమయంలో హిడ్మా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మా, అతని అనుచరులు ఈ దాడిలో మృతిచెందినట్లు ప్రచారం జరిగినా.. పోలీసులు దీన్ని నిర్ధారించలేదు. ‘‘హెలికాప్టర్లో ఉన్నవారంతా క్షేమంగా బేస్క్యాంప్ చేరుకున్నారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు’’ అని బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. హిడ్మాపై రూ.45లక్షల రివార్డు ఉంది. భద్రతా దళాలను హతమార్చిన ఘటనల్లో హిడ్మా కీలక నిందితుడు. పాతికేళ్లుగా పోలీసులకు మోస్ట్వాంటెడ్గా ఉన్నాడు.
కన్నుగప్పి తప్పించుకున్న హిడ్మా?
దండకారణ్యంలో అణువణువూ తెలిసిన హిడ్మా.. పోలీసుల ఆపరేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి హిడ్మా బలౌరీలో సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడి నుంచి చుట్టూ నాలుగు అంచెల్లో హిడ్మా అంగరక్షకులు కాపుకాచారని తెలుస్తోంది. కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాల హెలికాప్టర్, డ్రోన్లు బలౌరీ వైపు వెళ్తుండడాన్ని గమనించే.. యాంపురం వద్ద ఉన్న హిడ్మా అనుచరులు కాల్పులు జరిపినట్లు స్పష్టమవుతోంది. పోలీసు తేరుకొనేలోపే హిడ్మా ఎస్కేప్ అయినట్లు తెలిసింది.
తెలంగాణ సరిహద్దుల్లో హైఅలెర్ట్
ఛత్తీ్సగఢ్ కాల్పుల ఘటన నేపథ్యంలో మావోయిస్టులు తలదాచుకునేందుకు తెలంగాణలోకి వచ్చే అవకాశాలుండడంతో.. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం సరిహద్దుల వద్ద హైఅలెర్ట్ ప్రకటించారు.
అటవీ గ్రామాల్లో దాడులు: మావోయిస్టులు
సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాల ఏరియల్ దాడులను మావోయిస్టులు ఖండించారు. తెలంగాణ, ఛత్తీ్సగఢ్ సరిహద్దుల్లోని గ్రామాల్లో వైమానిక బాంబు దాడులు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ సుక్మా సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ పేరుతో బుధవారం అర్ధరాత్రి ఓ లేఖ విడుదలైంది. తెలంగాణ, ఛత్తీ్సగఢ్ పోలీసులు డ్రోన్లు, హెలీక్రాఫ్టర్ల ద్వారా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
Updated Date - 2023-01-12T06:42:01+05:30 IST