Minister: తమిళ మంత్రాలతో పళని ఆలయ కుంభాభిషేకం
ABN, First Publish Date - 2023-01-13T11:53:58+05:30
దిండుగల్ జిల్లాలో ప్రసిద్ధిచెందిన పళని దండాయుధపాణి ఆలయంలో నిర్వహించే కుంభాభిషేకం వేడుకల్లో తమిళంలో మంత్రాలు పఠించను
- మంత్రి శేఖర్బాబు
ప్యారీస్(చెన్నై), జనవరి 12: దిండుగల్ జిల్లాలో ప్రసిద్ధిచెందిన పళని దండాయుధపాణి ఆలయంలో నిర్వహించే కుంభాభిషేకం వేడుకల్లో తమిళంలో మంత్రాలు పఠించనున్నట్లు అసెంబ్లీలో హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు(Minister PK Shekhar Babu) ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో, తిరువిడైమరుదూర్ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే కోవైచెళియన్, రామనాధస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు, మహాకుంభాభిషేకం నిర్వహణపై ప్రశ్నలు సంధించారు. ఇందుకు మంత్రి శేఖర్బాబు సమాధానం చెబుతూ, రామనాధస్వామి ఆలయానికి రూ.12 లక్షల వ్యయంతో చేపట్టిన జీర్ణోద్ధరణ పనులు రానున్న మూడు నెలల్లో పూర్తవుతాయని, ఆ తర్వాత కుంభాభిషేకం తేది అధికారపూర్వకంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. అనంతరం పళని ఆలయం గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఈ నెల 27వ తేది తమిళ మంత్రాలతో పళని దండాయుధపాణి ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆహ్వాన పత్రికను మొట్టమొదటిసారిగా తమిళంలో ముద్రించడం జరిగిందన్నారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవారం, తిరువాసగాన్ని అన్ని ఆలయాల్లో క్రమం తప్పకుండా పఠిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 100 మందికి పైగా కీర్తనలు ఆలపించే గాయకులను నియమించినట్లు మంత్రి తెలిపారు.
Updated Date - 2023-01-13T11:54:00+05:30 IST