Roopa and Rohini: రూప, రోహిణిపై కర్ణాటక సర్కారు సీరియస్
ABN, First Publish Date - 2023-02-21T03:44:33+05:30
పర్సనల్ ఫొటోల విషయమై ఇద్దరు సీనియర్ మహిళా అధికారుల మధ్య కొనసాగుతున్న రగడను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
బెంగళూరు, ఫిబ్రవరి 20: పర్సనల్ ఫొటోల విషయమై ఇద్దరు సీనియర్ మహిళా అధికారుల మధ్య కొనసాగుతున్న రగడను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దేవదాయశాఖ కమిషనర్ రోహిణి సింధూరి(ఐఏఎస్), హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రూపాముద్గల్(ఐపీఎస్) మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇద్దరిపైనా చర్యలుంటాయని రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర సోమవారం హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, డీజీపీలతోనూ తాను చర్చించానన్నారు. ‘ఈ అంశంపై మేం మౌనంగా కూర్చోబోం. వారిద్దరిపైనా చర్యలు తీసుకుంటాం. సాధారణ ప్రజలు కూడా వీధుల్లో ఇంతదారుణంగా తిట్టుకోరు. వ్యక్తిగత అంశాలపై వారిద్దరూ ఏమేం చేయాలనుకొంటున్నారో చేయనీయండి. కానీ, మీడియా ముందుకు రావడం, వారు ప్రవర్తిస్తున్న తీరు సరికాదు’ అని హోంమంత్రి పేర్కొన్నారు. 2021లో రోహిణి మైసూరు కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి రూప, రోహిణి పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకొంటున్నారు. తాజాగా రోహిణి పర్సనల్ ఫొటోలను రూప ఆదివారం ఫేస్బుక్లో పెట్టడంతో వీరి మధ్య వివాదం తారస్థాయికి చేరింది.
Updated Date - 2023-02-21T03:44:34+05:30 IST