GK Vasan: రెండు రోజుల్లో కూటమి అభ్యర్థి
ABN, First Publish Date - 2023-01-20T09:09:23+05:30
ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిని రెండు రోజుల్లో కూటమి ప్రకటిస్తుందని టీఎంసీ అధినేత జీకే వాసన్
- టీఎంసీ అధినేత జీకే వాసన్
పెరంబూర్(చెన్నై), జనవరి 19: ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిని రెండు రోజుల్లో కూటమి ప్రకటిస్తుందని టీఎంసీ అధినేత జీకే వాసన్(GK Vasan) ప్రకటించారు. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ ఈవేరా ఇటీవల కన్ను మూయడంతో ఫిబ్రవరి 27న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి యువరాజా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి తిరుమగన్ ఈవేరాకు 67,300 ఓట్లు రాగా, యువరాజాకు 58,392 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈసారి ఎన్నికల్లోనూ టీఎంసీయే పోటీ చేస్తుందని అన్నాడీఎంకే కూటమిలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేతలైన జయకుమార్, వళర్మతి, గోకుల ఇందిర, బెంజిమెన్ తదితరులు గురువారం ఆళ్వారుపేటలోని టీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో టీఎంసీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి జీకే వెంకటేశ్, రాష్ట్ర కార్యదర్శులు జవహర్బాబు, రాజం, జిల్లా కార్యదర్శి సైదై మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఇరు పార్టీల నేతల ఈ నియోజకవర్గంలో పోటీపై చర్చించారు. అనంతరం జీకే వాసన్ విలేఖరులతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే కూటమిలో టీఎంసీ ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనే వ్యూహంతో కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయన్నారు. ఉప ఎన్నిక విషయమై రెండ్రోజుల క్రితం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని తాను స్వయంగా కలిసి చర్చించానని, అప్పటికి ఉప ఎన్నిక తేది ప్రకటించకపోవడంతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు ప్రాధాన్యమిచ్చామన్నారు. ఇప్పుడు ఎన్నిక తేదీ ప్రకటించిన తరువాత కూడా పళనిస్వామితో మాట్లాడానన్నారు. ఆయన సూచనల మేరకు ఆ పార్టీ సీనియర్ నేతలు తమ వద్దకు వచ్చి చర్చించారని వివరించారు. ఉప ఎన్నికలో విజయం సాధించడమే కూటమి పార్టీల లక్ష్యమన్నారు. కూటమి పార్టీల ఏకాభిప్రాయంతో మరో రెండ్రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని జీకే వాసన్ పేర్కొన్నారు.
Updated Date - 2023-01-20T09:09:24+05:30 IST