Prachanda: నేపాల్ ప్రధాని ప్రచండపై కేసు!
ABN, First Publish Date - 2023-03-06T02:11:56+05:30
మావోయిస్టుల తిరుగుబాటు కాలంలో 5వేల హత్యలకు తనదే బాధ్యతంటూ నేపాల్ ప్రధాని ప్రచండ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన రిట్ పిటిషన్లను నమోదు చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు తన పరిపాలన విభాగాన్ని ఆదేశించింది.
5 వేల హత్యలకు తనదే బాధ్యతన్న వ్యాఖ్యల ఫలితం
కాఠ్మండు, మార్చి 5: మావోయిస్టుల తిరుగుబాటు కాలంలో 5వేల హత్యలకు తనదే బాధ్యతంటూ నేపాల్ ప్రధాని ప్రచండ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన రిట్ పిటిషన్లను నమోదు చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు తన పరిపాలన విభాగాన్ని ఆదేశించింది. ప్రజాయుద్ధం పేరిట ప్రచండ నేతృత్వంలో మావోయిస్టులు 1996 ఫిబ్రవరి 13న ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభించారు. 2006 నవంబరు 21 వరకు కొనసాగిన ఆ తిరుగుబాటులో సుమారు 17 వేల మంది మరణించారు. ఆ తర్వాత శాంతి ఒప్పందం కుదరడంతో మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు జనజీవన స్రవంతిలో కలిశారు. అనంతర రాజకీయ పరిణామాల్లో గతేడాది డిసెంబరు 26న నేపాల్ ప్రధానమంత్రిగా ప్రచండ ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు 2020 జనవరి 15న కాఠ్మండులో నిర్వహించిన మఘి పండుగ వేడుకల్లో మావోయిస్టు పార్టీ నేత ప్రచండ మాట్లాడుతూ.. ‘‘17 వేల మందిని చంపినట్టు నాపై ఆరోపణలు ఉన్నాయి. అది నిజం కాదు. 5 వేల హత్యలపై బాధ్యత తీసుకునేందుకు నేను సిద్ధం. మిగిలిన 12 వేల మందిని నాటి ఫ్యూడల్ ప్రభుత్వం చంపేసింది’’ అని ప్రచండ పేర్కొన్నారు. దీంతో మావోయిస్టుల తిరుగుబాటు బాధిత కుటుంబాలకు చెందిన న్యాయవాదులు జ్ఞానేంద్ర ఆరన్, కల్యాణ్ బుద్ధతోకి వేర్వేరుగా ప్రచండకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Updated Date - 2023-03-06T02:11:56+05:30 IST