తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారు
ABN, First Publish Date - 2023-04-30T01:23:21+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
సత్తుపల్లి/వేంసూరు/ కల్లూరు, ఏప్రిల్ 29: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురంలో శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగణలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి అవతల గట్టున (ఏపీ)లో జరగకపోవడంతో ఆ రాష్ట్ర ప్రజలు ఆగమయ్యారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ర్టాల వారు కూడా తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారన్నారు. కొద్దికాలంలోనే హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబు ఆహ్వానంతో వచ్చిన రజనీకాంత్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని పొగిడారంటూ గుర్తుచేశారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు ప్రవేశపెట్టారని, రానున్న కాలంలో అన్ని సామాజికవర్గాలకు ‘బంధు’ అమలవుతుందన్నారు. 2014కు ముందున్న తెలంగాణాను కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని ప్రజలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, బీజేపీ, కాంగ్రెస్లు చేయించిన సర్వేల్లో కూడా ఇదే విషయం స్పష్టమైందన్నారు. విద్యవైద్య రంగాల్లో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, రైతుబంధు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు పాల్గొన్నారు.
క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
రాష్ట్రంలో క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. క్రీడా శాఖమంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు. కల్లూరులో రూ.3.40 కోట్ల అంచనాతో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ మినీస్టేడియాన్ని శనివారం ఆయన ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు. క్రీడాకారులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 14,570 మంది క్రీడాకారుులకు ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి గానూ ఇప్పటి వరకు 135 మినీస్టేడియాలను మంజూరు చేశామని, అందులో 50శాతం పూర్తి చేశామని మంత్రి శ్రీనివాసగౌడ్ వివరించారు. ఈ సందర్భంగా స్టేడియం, జిమ్ క్రీడా ప్రాంగణం, వేసవి క్రీడల శిక్షణ శిబిరాన్ని మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రారంభించారు.
Updated Date - 2023-04-30T01:23:39+05:30 IST