హైదరాబాద్లో గోల్డ్మన్ శాక్స్ కొత్త కార్యాలయం
ABN, First Publish Date - 2023-10-06T02:31:15+05:30
గోల్డ్మన్ శాక్స్ హైదరాబాద్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ‘ఒపెల్’ పేరుతో ప్రారంభించిన ఈ కార్యాలయం కంపెనీకి ఎక్సలెన్స్ కేంద్రంగా పని చేస్తుంది. సలార్పురియా సత్వ నాలెడ్జ్ సిటీలోని...
2,500 మంది నిపుణులకు సదుపాయం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గోల్డ్మన్ శాక్స్ హైదరాబాద్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ‘ఒపెల్’ పేరుతో ప్రారంభించిన ఈ కార్యాలయం కంపెనీకి ఎక్సలెన్స్ కేంద్రంగా పని చేస్తుంది. సలార్పురియా సత్వ నాలెడ్జ్ సిటీలోని తొమ్మిది అంతస్తుల్లో 3.51 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ కార్యాలయంలో 2,500 నిపుణులు, ఉద్యోగులు పని చేయొచ్చు. కొత్త కార్యాలయాన్ని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. 2021లో హైదరాబాద్లో కార్యకలాపాలు ప్రారంభించిన గోల్డ్మన్ శాక్స్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం ఇక్కడి మౌలిక సదుపాయాలకు దర్పణం పడుతోంది. అనేక బహుళ జాతి కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని కేటీఆర్ అన్నారు. గ్లోబల్ కంపెనీలు రావడం వల్ల స్థానిక నిపుణులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. గత రెండు దశాబ్దాల్లో బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాలు కంపెనీ అంతర్జాతీయ కార్యకలాపాల్లో భాగమయ్యాయని గోల్డ్మన్ శాక్స్ ఇంటర్నేషనల్ సీఈఓ రిచర్డ్ గోండే అన్నారు.
ప్రస్తుతం 1,500 నిపుణులు: ప్రస్తుతం హైదరాబాద్లో గోల్డ్మన్ శాక్స్కు 1,500 మంది నిపుణులు ఉన్నారు. వీరిలో 75 శాతం మందిని కంపెనీ కొత్తగా నియమించుకుంది. ఇక్కడ నుంచి ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లోని కంపెనీలకు క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీల్లో సేవలు అందిస్తోంది.
Updated Date - 2023-10-06T02:31:15+05:30 IST