Akasa Airlines: 43 మంది పైలట్ల రాజీనామా.. కోర్టును ఆశ్రయించిన ఎయిర్లైన్స్
ABN, First Publish Date - 2023-09-16T21:57:12+05:30
పలువురు పైలట్ల వరుస రాజీనామాలతో ఇబ్బందుల్లో పడ్డ ఆకాశా ఎయిర్లైన్స్ తాజాగా కోర్టును ఆశ్రయించింది.
ఇంటర్నెట్ డెస్క్: పలువురు పైలట్ల వరుస రాజీనామాలతో ఇబ్బందుల్లో పడ్డ ఆకాశా ఎయిర్లైన్స్(Akasa Airlines) తాజాగా కోర్టును ఆశ్రయించింది. రాజీనామా లేఖలు ఇచ్చాక నిబంధనల ప్రకారం సంస్థలో కొంతకాలం పాటు పనిచేయకుండా పైలట్లు వెళ్లిపోవడంతో సంస్థ ఆదాయానికి గండిపడిందని చెప్పింది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు వారి నుంచి రూ.22 కోట్ల మేర పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
సంస్థ పిటిషన్ ప్రకారం, ఇటీవల కొన్ని నెలల వ్యవధిలోనే ఏకంగా 43 మంది పైలట్లు ఉద్యోగ కాంట్రాక్ట్ నిబంధనల ఉల్లంఘిస్తూ సంస్థను వీడారు. ఫలితంగా గత నెలలో ఆకాశ ఎయిర్లైన్స్ పలు విమాన సర్వీసులను చివరి నిమిషంలో రద్దు చేయాల్సి వచ్చింది.
పైలట్ల తీరు చట్టవిరుద్ధమని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రతినిధి మీడియాతో తెలిపారు. అనైతికమని కూడా వ్యాఖ్యానించారు. పైలట్ల స్వార్థపూర్తిత చర్యల వల్ల చివరి నిమిషంలో అనేక విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని, వేల మంది కస్టమర్లు ఇక్కట్ల పాలయ్యారని చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-09-16T21:57:15+05:30 IST