ఇరువర్గాల కొట్లాట
ABN, First Publish Date - 2023-09-22T00:02:44+05:30
పాత గొడవల నేపథ్యంలో అలుగులగూడెం – దెందులూరు గ్రామాలకు చెందిన రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకుల మధ్య జరిగిన కొట్లాట తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
దెందులూరు – అలుగులగూడెంలలో తీవ్ర ఉద్రిక్తత
చెదరగొట్టిన పోలీసులు..
144 సెక్షన్ అమలు
దెందులూరు, సెప్టెంబరు 21 : పాత గొడవల నేపథ్యంలో అలుగులగూడెం – దెందులూరు గ్రామాలకు చెందిన రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకుల మధ్య జరిగిన కొట్లాట తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. పోలీ సులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, 144 సెక్షన్ విధిం చారు. స్థానికులు తెలిపిన వివరాలివి.. దెందులూరు మండలం అలుగులగూడెంకు చెందిన యువకులకు, దెందులూరుకు చెందిన యువకులకు బస్సులో కాలేజీకి వెళ్లే సమయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం రాత్రి అలుగులగూడానికి చెందిన ముగ్గురు యువకులు దెందులూరు మీదుగా తమ గ్రామం వస్తుండగా కొందరు వీరిపై దాడి చేశారు. దీంతో ముగ్గురు గాయపడడంతో చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రిలో చేరారు. అక్కడి పోలీసులు ఎమ్మెల్సీ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తమపై కేసు పెడతారా అంటూ గురువారం ఉదయం దెందులూరులో కొందరు యువకులు అలుగులగూడెంకు చెందిన వారిపై గొడవకు దిగారు. ఇటువైపు ‘మీ ఊరు వస్తే మీరు కొడితే మాఊరు వస్తే మేము కొడతామ’ని కర్రలతో అలుగులగూడెం రైల్వే గేటు సమీపంలో పెద్ద ఎత్తున మొహరించారు. అటు దెందులూరు గాంధీ బొమ్మ వద్ద స్థానికులు వంద మందితో నిలబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు భారీగా తరలి వచ్చారు. ఇరు వర్గాలతో అడిషనల్ ఎస్పీ భాస్కరావు, డీఎస్పీ గౌడ్ చర్చలు జరుపుతుండగానే దెందులూరుకు చెందిన వ్యక్తిపై అలుగుగూడెం వాసులు దాడి చేశారు. దీంతో ఇరువర్గాలు కొట్లాటకు దిగాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని, రాళ్లు రువ్వుకుని వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో పోలీసులు ఇరువురిని చెదర గొట్టారు. సాయంత్రం ఇరువర్గాల పెద్దలతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేసి శాంతింపజేశారు. సున్నితమైన అంశాన్ని పెద్దది చేయవద్దని, ఇరు వర్గాలు శాంతి యుతంగా ఉండాలని కోరారు. భీమడోలు, నూజివీడు సీఐలతోపాటు ఆరుగురు ఎస్ఐలు, భారీగా పోలీసులు గస్తీ నిర్వహించారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకూ ఇరు గ్రామాల్లోనూ 144 సెక్షన్ విధించినట్లు ఏఎస్పీ తెలిపారు.
Updated Date - 2023-09-22T00:02:44+05:30 IST