అధ్యక్షా.. ఇటు చూడరూ!
ABN, First Publish Date - 2023-09-21T00:39:12+05:30
పోలవరం పట్టాలెక్కలేదు. చింతలపూడి ఎత్తిపోతలకు దిక్కు లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టించుకునే నాథుడే లేరు. జిల్లా రహదారులన్నీ గుల్ల గుల్లగా మారాయి.
నేటి నుంచి శాసనసభ సమావేశాలు
మూలపడిన పోలవరం ప్రాజెక్టు
చింతలమయంగా చింతలపూడి లిఫ్ట్
గుర్తుకు రాని ఏలూరుకు గోదావరి జలాల మళ్లింపు
అస్తవ్యస్తంగా యూజీడీ వ్యవస్థ
నిధుల కేటాయింపులపై ప్రజల ఆశలు
(ఏలూరు – ఆంధ్రజ్యోతి)
పోలవరం పట్టాలెక్కలేదు. చింతలపూడి ఎత్తిపోతలకు దిక్కు లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టించుకునే నాథుడే లేరు. జిల్లా రహదారులన్నీ గుల్ల గుల్లగా మారాయి. ఏలూరు నగరానికి ఇస్తామన్న గోదావరి జలాలకు దారి దొరకడం లేదు. యూజీడీ నిర్మాణానికి నిధులు అడిగే నాయకులే కరువవ్వగా వెరసి ఏలూరు జిల్లా క్రమేణ వెనకబడ్డ ప్రాంతంగా మారే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలపైనే జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు జరగబోయే చివరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా నిధులు కేటాయిస్తారా? ఏ ప్రాజెక్టుపై ప్రథమ దృష్టి సారిస్తారా? అని జిల్లా ప్రజానీకం ఎదురుచూస్తోంది.
బహుళార్థక సాధక ప్రాజెక్టుగా మొదలైన పోలవరం ప్రాజెక్టు నానాటికీ ప్రశ్నార్థకంగా మారుతోంది. కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకూ తాగు, సాగు నీటి ప్రాజెక్టుగా శ్రీశైలం ప్రాజెక్టు తర్వాత అంతటి ఘనకీర్తి వహించే స్థాయిలో ఈ ప్రాజెక్టును నిర్మింప తలబెట్టారు. టీడీపీ హయాంలో జోరందుకున్న పనులు నాలుగేళ్లుగా కుదేలయ్యాయి. కేవలం మరమ్మతులు మినహా పూర్తి స్థాయి నిర్మాణాలు చేపట్టలేని స్థితిలో ప్రాజెక్టు పనులను ప్రభుత్వం నెట్టుకువస్తోంది. డీడీఆర్పీ (డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) వంటి అధ్యయన బృందాలు ప్రాజెక్టు నిర్మాణాలు, పనులపై పెదవి విరుస్తూనే ఉన్నాయి. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నడుమ ఇటీవల చేరుకున్న సీపేజీ జలాల కారణంగా డయాఫ్రం వాల్ పనులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. గ్యాప్ల పూడ్చివేతలు, డయాఫ్రం వాల్ వైబ్రో కంప్రాక్షన్ పను లు ఆగిపోయాయి. కుంగిన గైడ్బండ్ వాల్కు తాత్కాలికంగా మరమ్మ తులు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో గైడ్బండ్ పనులు జరగడంలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, నిర్వాసితులకు పునరా వాసాలు, కాలనీల నిర్మాణా లతో పాటు ప్రాజెక్టు నిర్మాణం వెరసి టీడీపీ హయాంలో సుమారు రూ. 55వేల కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో 72 శాతం నిర్మాణ పనులను పూర్తి చేయగలిగింది. వైఎస్సార్ హయాం నుంచి ఇప్పటి వరకు రూ.14 వేల కోట్లు ఖర్చు పెట్టినా నేటికీ కాలనీల నిర్మాణాలతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలకు మోక్షం కలగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పరిస్థితులపై అధ్యయనం చేసి పూర్తిస్థాయి నిధుల విడుదలతో పాటు పనుల్లో వేగం పెంచే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
‘చింతల’పూడి
మెట్ట ప్రాంతాలకు నీళ్లందిం చాలన్న ఆలోచన నుంచి పుట్టిం దే చింతలపూడి ఎత్తి పోతల పథకం. వందల కోట్ల నిధులను కేటాయించినా ఈ ప్రభుత్వం హయాంలో ఆ ప్రాజెక్టు దిశగా దృష్టి సారించక పోవడం గోదావరి ప్రాంత వాసులకు శాపంగా మారింది. కేవలం చంద్రబాబు చేతుల మీదుగా ఎదిగిన ప్రాజెక్టు అన్న ఒక్క కారణంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారో! లేదా నిజంగా ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వానికి అవగాహన లేదో గానీ రూ. 1702 కోట్ల అంచనాలతో మొదలైన ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి ప్రాంత మెట్ట భూమలన్ని పచ్చని పంటలతో కళకళలాడేవి. తాడిపూడి నుంచి చింతలపూడి వరకు తాగు నీరు అందించే ఈ లిఫ్ట్ వాస్తవానికి వైఎస్సార్ హయాంలో తొలి అడుగుపడ్డ టీడీపీ హయాంలో ఈ పథకాన్ని మరిన్ని ఎక్కువ గ్రామాలకు విస్తరించేలా మార్పులు చేయించింది. ఫలితంగా అంచనా వ్యయాలు పెరిగి దాదాపు రూ.5వేల కోట్లకు పెరిగిం ది. కాలువల నిర్మాణాలు సమాంతరంగా తాడిపూడి వద్ద ఎత్తిపోతల విభాగం పనులను వేగవంతం చేయించారు. 2019 తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందాన మారింది. అంచనా వ్యయాలు రూ. 9,900 కోట్లకు చేరింది. గడిచిన బడ్జెట్ సమావేశాల్లో చింతలపూడి లిఫ్ట్కు నిధులు కేటాయిస్తున్నా మంటూ ప్రభుత్వం ఘనంగా ప్రకటన చేసింది. కానీ, విడుదల చేసింది మాత్రం శూన్యం. సుమారు రూ. 163 కోట్ల పనులకు రూపాయి నిధులు విడుదల చేయలేదు. ప్రస్తుత తరుణంలో కాలువల నిర్మాణాలైనా పూర్తి కావాలంటే కనీసం రూ.2 వేల కోట్లు అయినా ప్రభుత్వం విడుదల చేస్తేనే సాధ్యమని తెలుస్తోంది.
గోదావరి నీళ్లు ఏవండీ!
’ఏలూరుకు గోదావరి నీళ్లు తెప్పిస్తాం. ప్రతీ ఇంటికీ పైపుల ద్వారా గోదావరి జలాలను పంపిణీ చేస్తాం.. ఏలూరు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ అందుబాటులో తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తాం.’అని గడిచిన స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజా ప్రతి నిధులు హామీలు గుప్పించారు. నేటికీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. నిన్నటి వరకు లక్షన్నరకు పైగా ఉన్న ప్రజానీకం ఇటీవల జరిగిన ఏడు గ్రామాల విలీనం అనంతరం మూడు లక్షలు దాటింది. టీడీపీ హయాం లో మొదలు పెట్టి, పైలెట్ ప్రాజెక్టు కింద పనిచేయించిన యూజీడీ పనులు మినహా గడిచిన నాలుగున్నరేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా నేటికీ నగరంలోని ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నీటిని అంతా శుద్ధి చేయకుండానే నేరుగా కాల్వల్లో కలిపేస్తున్నారు. ఇది సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిసినా ఏ ఒక్కరూ పట్టించుకోకపో వడంతో ప్రజలు అంటు రోగాల పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఏలూరులో గతంలో ప్రబలిన వింత రోగం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. కనీసం జరగబోయే అసెంబ్లీ సమావేశాలతోనైనా ఏలూరు భవితను మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2023-09-21T00:39:12+05:30 IST