ఇద్దరు కొడుకులున్నా అనాథగా..
ABN, First Publish Date - 2023-01-18T00:23:35+05:30
అనారోగ్యంతో మంచంలో ఉన్న తండ్రిని అనాథగా వదిలేశారా పుత్రులు.
ముదినేపల్లి రూరల్, జనవరి 17: అనారోగ్యంతో మంచంలో ఉన్న తండ్రిని అనాథగా వదిలేశారా పుత్రులు. మండలంలోని చిగురుకోట గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధుడు గొల్లా పేతురు భార్య ఏడాది కిందట మృతి చెందింది. ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశీర్వాదం రక్షణ శాఖలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. తల్లి మృతి చెందటంతో తండ్రిని ఆశీర్వాదం విజయవాడలోని తన ఇంటికి తీసుకెళ్లి ఆయన పేర ఉన్న ఆస్తిని తన పేర రాయించుకుని తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చి వదిలేశాడు. కొద్ది రోజుల క్రితం పేతురు పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమయ్యాడు. సమాచారాన్ని పెద్ద కుమారుడికి, గ్రామంలో ఉన్న చిన్న కుమారుడికి తెలిపినా వారు పట్టించుకోకపోవడంతో సమీపంలోని ఓ వృద్ధుడు పేతురుకు సహాయం చేస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రామస్థులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, స్పందించి పోలీసులు కుమారులకు ఫోన్ చేసి మాట్లాడారు. అయినా వారు పట్టించుకోలేదు. మంగళవారం మరోసారి గ్రామస్థులు తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. కుమారులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని హామీ ఇచ్చారు.
Updated Date - 2023-01-18T00:23:38+05:30 IST