హైస్కూల్ ప్లస్.. జీరో రిజల్ట్!
ABN, First Publish Date - 2023-06-07T00:01:12+05:30
శృంగవరపుకోట మండలం ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఏడాది ఏర్పాటు చేసిన ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలిది. ఈ కళాశాలలో బాలికలను చేర్చేందుకు విద్యాశాఖాధికారులు నానా తంటాలు పడ్డారు. ఇక్కడే చదవాలంటూ పది ఉత్తీర్ణత సాధించిన స్థానిక బాలికలకు టీసీలు ఇవ్వకుండా తిప్పారు.
ధర్మవరం బాలికల కళాశాలలో తప్పిన ఇంటర్ విద్యార్థులు
బోధనా సిబ్బంది లేకపోవడమే కారణం
ఈ ఏడాదీ బైపీసీ కోర్సు నిర్వహణకే పీజీటీల నియామకం
కొత్త చేరికలకు కుస్తీ పడుతున్న విద్యాశాఖ అధికారులు
ముఖం చాటేస్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులు
శృంగవరపుకోట, జూన్ 6:
- శృంగవరపుకోట మండలం ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఏడాది ఏర్పాటు చేసిన ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలిది. ఈ కళాశాలలో బాలికలను చేర్చేందుకు విద్యాశాఖాధికారులు నానా తంటాలు పడ్డారు. ఇక్కడే చదవాలంటూ పది ఉత్తీర్ణత సాధించిన స్థానిక బాలికలకు టీసీలు ఇవ్వకుండా తిప్పారు. ప్రజాప్రతినిధులతో కలసి నూతన కళాశాలతో మంచి భవిష్యత్ ఉంటుందని ఊరూరా తిరిగి అవగాహన కల్పించారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన గ్రామానికి ఒకరిద్దరు చొప్పున 12 మంది బాలికలను మాత్రమే చేర్చగలిగారు. వీరందరికి బైపీసీ కోర్సులో కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు. పరీక్షల్లో చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేకపోయారు. జీరో రిజల్ట్ రావడం అందరినీ ఆలోచనలో పడేసింది. హైస్కూల్ ప్లస్ పేరిట జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ఒకేఒక్క మహిళా జూనియర్ కళాశాలలో రిజల్ట్ ప్రతికూలంగా రావడం అందరినీ నిర్ఘాంతపరిచింది. దీంతో ఈ ఏడాది కళాశాలలో కొత్తగా చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
సిబ్బంది నియామకాలు లేకే!
ధర్మవరంలో మహిళా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం బోధన, బోధనేతర సిబ్బందిని మాత్రం నియమించలేదు. దీంతో చుట్టుపక్కల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించారు. ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జీరో ఫలితం నమోదైంది. అయితే కొత్త చేరికల కోసం ఈ ఏడాది మాత్రం పీజీ, డిగ్రీ ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాఽధ్యాయులను పీజీటీలుగా నియమించారు. బైపీసీ కోర్సులో చేరిన వారికి మాత్రమే వీరు ఈ ఏడాది నుంచి పాఠాలు చెప్పనున్నారు. మిగిలిన కోర్సుల్లో ఎవరైనా చేరితే గతేడాదిలా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులే గతి.
రండి.. రండి.. రండి
బైపీసీ కోర్సును నిర్వహించేందుకు నియమించిన పీజీటీలకు కళాశాలలో విద్యార్థులను చేర్చే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. దీంతో వీరంతా రోజూ తమ కళాశాలలో చేరండంటూ ఊరూరా తిరుగుతున్నారు. పల్లెల్లోని ఇంటింటికీ వెళ్లి బాలికలు, వారి తల్లిదండ్రులను కోరుతున్నారు. బాలికలు, తల్లిదండ్రులు మాత్రం ముఖం చాటేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మహిళ కళాశాలలో ఒక్కటంటే ఒక్క ప్రవేశం జరగలేదు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది పది ఉత్తీర్ణత సాధించిన బాలికలను ఇక్కడే చదివేలా ఒత్తిడి తెచ్చేందుకు విద్యాశాఖాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు టీసీలు ఇవ్వనట్లు తెలిసింది.
వసతులూ మృగ్యం
మండలానికో బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చడంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం 2022-2023 విద్యాసంవత్సరంలో ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ ప్లస్ పేరుతో ఇంటర్ కోర్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జిల్లాలో అన్ని మండలాల్లోను కస్తూర్బా పాఠశాలలు వున్నాయి. ఈ మండలంలో లేకపోవడంతో జిల్లాలో ఈ ఒక్కచోట హైస్కూల్ ప్లస్కు అవకాశం కల్పించారు. బైపీసీ, ఎంపిసీ, సీఈసీ గ్రూపులను మంజూరు చేసిన ప్రభుత్వం బోధన, బోధనేతర ఉద్యోగులను నియమించలేదు. కనీసం వసతులు కల్పించలేదు. కేవలం ఉన్నత పాఠశాలలో వున్న సదుపాయాలు, ల్యాబ్లను వినియోగించుకోనేలా చర్యలు తీసుకున్నారు.
ఎంపీసీ, సీఈసీ బోధనెలా?
కళాశాలలో తెలుగు, ఇంగ్లీష్, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ పాఠ్యాంశాలు బోధించేందుకు ఆరుగురు పీజీటీలను నియమించారు. ఎంపీసీ, సీఈసీల్లో చేరిన వారికి గణితం, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ పాఠ్యాంశాల బోధనకు అధ్యాపకులెవరూ లేరు. సరైన అధ్యాపక బృందం లేకుండా కళాశాలలో ప్రవేశాలకు విద్యాశాఖాధికారులు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. ఈఏడాది పది ఉత్తీర్ణత సాధించిన బాలికలకు టీసీ(బదిలీ ధ్రువపత్రాలు) ఇవ్వకుండా జాప్యం చేయడం ద్వారా చేరికలకు ప్రయత్నిస్తున్నారు. ఈ కళాశాల వున్న ఉన్నత పాఠశాలలో 21మంది బాలికలు పదో తరగతిలో ఉత్తీర్ణత పొందారు. ఇక్కడ చదివితేనే టీసీలు ఇస్తామన్న మెలక పెట్టేందుకు విద్యాశాఖ సిద్ధపడుతోంది. కనీసం ఈ పాఠశాల విద్యార్థులతోనైనా చేరికలు చూపాలన్న పట్టుదలను ఈశాఖ కనబరుస్తోంది. బలవంతంగా చేరికలకు దరఖాస్తులపై సంతకాలు పెట్టించుకుంటున్నారు.
ఎస్.కోటలో ఉంటే బాగుండేదేమో
విజయనగరం పట్టణం తరువాత అత్యధిక విద్యాసంస్థలున్న ప్రాంతం శృంగవరపుకోట. ఇక్కడ ఎల్కేజీ నుంచి పీజీ వరకు బోధించే విద్యాసంస్థలున్నాయి. ఇంటర్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో వున్న కళాశాలలకు కొదవ లేదు. నియోజకవర్గ పరిధిలోని వేపాడ, ఎల్.కోట, జామి, కొత్తవలస, మండలాలతో పాటు గంట్యాడ మండల గ్రామాలకు శృంగవరపుకోట అనుసంధానంగా వుంది. ఇక్కడున్న బాలికల ఉన్నత పాఠశాలలో ఏటా పదోతరగతి విద్యార్థులు వంద మందికి పైబడి పరీక్షలు రాస్తున్నారు. ఈ పాఠశాలలో హైస్కూల్ ప్లస్ను ఏర్పాటు చేసి వుంటే బాలికల చేరికలు కాస్త ఈజీ అయ్యేవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అవగాహన కల్పిస్తున్నాం
హైస్కూల్ ప్లస్ ద్వారా ఈ పాఠశాలలో ఇంటర్ ఉంటుంది. ఇక్కడ చదివిన పదోతరగతి విద్యార్థులంతా ఈ బాలికల జూనియర్ కళాశాలలో చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇంతవరకు ఎనిమిది మంది బాలికలు అంగీకార పత్రాలు ఇచ్చారు. ఆరుగురు పీజీటీలను ప్రభుత్వం నియమించింది. వీరితో నాణ్యమైన విద్య అందుతుంది. పీజీటీలంతా టెన్త్ పూర్తయిన బాలికల తల్లిదండ్రుల మాట్లాడుతూ ఇక్కడ చేర్పించేలా అవగాహన కల్పిస్తున్నారు.
- బి.లక్ష్మి, హెచ్ఎం, ఉన్నత పాఠశాల, ధర్మవరం, ఎస్.కోట మండలం
Updated Date - 2023-06-07T00:01:12+05:30 IST