పేదల ఇళ్లు కూల్చివేత
ABN, First Publish Date - 2023-02-11T00:06:55+05:30
‘దశాబ్దాలుగా నివాసముంటున్నాం. కాయాకష్టం చేసుకుని బతుకుతున్నాం. మా ఇళ్లను తొలగించడం దారుణం. కనీసం కొంత సమయం ఇచ్చినా వేరేచోట నివాసం ఏర్పాటు చేసుకుంటాం. కొంచెం కనికరించండయ్యా’ అంటూ విజయనగరంలోని బొగ్గులదిబ్బ, ఎల్బీ కాలనీ వాసులు అధికారులను విజ్ఞప్తి చేశారు. కాళ్లావేల్లా పడ్డారు. కానీ వారు కనికరించలేదు. శుక్రవారం ఉదయం యంత్రాలతో వచ్చి ఆక్రమణల పేరిట ఇళ్లను తొలగించారు.
పేదల ఇళ్లు కూల్చివేత
ఆక్రమణల పేరిట తొలగింపు
కాళ్లా వేల్లా పడిన కనికరించని అధికారులు
బాధితులతో కలిసి ఆందోళనకు దిగిన నాయకులు
స్థానిక కార్పొరేటర్ల నిలదీత.. ఆందోళనకారుల అరెస్ట్
పోలీస్ నీడలో కొనసాగిన తొలగింపు ప్రక్రియ
విజయనగరం(ఆంధ్రజ్యోతి)/దాసన్నపేట: ‘దశాబ్దాలుగా నివాసముంటున్నాం. కాయాకష్టం చేసుకుని బతుకుతున్నాం. మా ఇళ్లను తొలగించడం దారుణం. కనీసం కొంత సమయం ఇచ్చినా వేరేచోట నివాసం ఏర్పాటు చేసుకుంటాం. కొంచెం కనికరించండయ్యా’ అంటూ విజయనగరంలోని బొగ్గులదిబ్బ, ఎల్బీ కాలనీ వాసులు అధికారులను విజ్ఞప్తి చేశారు. కాళ్లావేల్లా పడ్డారు. కానీ వారు కనికరించలేదు. శుక్రవారం ఉదయం యంత్రాలతో వచ్చి ఆక్రమణల పేరిట ఇళ్లను తొలగించారు. దీంతో బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ, జనసేనతో పాటు ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలుపుతూ ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతల నడుమ పోలీసుల నిఘా నీడలో.. ఇళ్ల తొలగింపు ప్రక్రియను కొనసాగించారు. గత 50 సంవత్సరాలకుగాపై బొగ్గుల దిబ్బ, ఎల్పీకాలనీ ప్రాంతంలో వంద మందికిపైగా నివాసముంటున్నారు. అయితే అవి ఆక్రమణల పేరిట నిర్మించుకున్న ఇళ్లని.. తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీచేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ అధికారులు యంత్రాలతో మోహరించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఇళ్ల కూల్చివేతకు దిగారు. అడ్డుకున్న నివాసితులను పక్కనపడేశారు. ఇంట్లో ఉన్న సామన్లు, ఇతరత్రా సామగ్రిని బయటపడేసి ఇళ్లను కూల్చివేశారు. దీంతో మహిళల రోదనలు మిన్నంటాయి. కళ్లేదుటే నివాసముంటున్న ఇళ్లను కూల్చివేస్తుండడంతో కన్నీరు పెట్టుకున్నారు. సమయం ఇవ్వాలని అధికారులు, పోలీసులు కాళ్లా వేల్లా పడినా కనికరించలేదు. దీంతో టీడీపీ, జనసేన, సీపీఎం నాయకులు అక్కడకు చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా ఇళ్ల తొలగింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడే బైఠాయించారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ ఆసమయంలో ఘటనాస్థలానికి వచ్చిన 39, 40 డివిజన్లలో కార్పొరేటర్లు బోనుల ధనలక్ష్మి, సుంకర బాబులకు కూడా బాధితుల నుంచి నిరసన ఎదురైంది. నిలదీతలతో పాటు ప్రశ్నలపరంపరను కొనసాగించారు. ఉద్రిక్తతల నడుమే ఇళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. సీపీఎం నేత రెడ్డి శంకరరావు మాట్లాడుతూ జీవో 225 ప్రకారం నివాసమున్నచోటే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ ఆక్రమణల పేరిట పేదల ఇళ్లను తొలగించడం దారుణమన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపకుండా నివాసముంటున్న ఇళ్లను కూల్చివేయడం దుశ్చర్యగా అభివర్ణించారు.
ఎక్కడికి వెళ్లాలి?
నా వయస్సు 60 ఏళ్లు. ఎప్పటి నుంచో ఇక్కడే జీవిస్తున్నాం. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లగలం. కొంచెం సమయం కావాలని కోరినా అధికారులు కనికరించలేదు. ప్రభుత్వం మాపై కక్ష కట్టడం దారుణం. ఇళ్లు మంజూరు చేశారు. కానీ ఇంతవరకూ ఎటువంటి నిర్మాణం పూర్తిచేయలేదు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి.
-జానకమ్మ, బాధితురాలు
ముందస్తుగా నోటీసులిచ్చాం
ఆక్రమణలపై చాలాసార్లు నోటీసులిచ్చాం. 117 మందికి ఖాళీచేయాలని నోటీసుల్లో పేర్కొన్నాం. వీరిలో 67 మందికి సారిపల్లి, గుంకలాం, కరకవలస లేఅవుట్లలో ఇళ్లు కూడా మంజూరు చేశారు. 18 మంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. వారి ఇళ్లను మినహాయించి మిగతావారి ఇళ్లను తొలగిస్తాం.
- అమ్మాజీరావు, టౌన్ ప్లానింగ్ అధికారి, విజయనగరం కార్పొరేషన్
Updated Date - 2023-02-11T00:06:56+05:30 IST