విశాఖ డెయిరీ పాల ధర పెంపు
ABN, First Publish Date - 2023-03-16T00:27:39+05:30
విశాఖ డెయిరీ యాజమాన్యం పాల అమ్మకం ధరను మరోమారు పెంచేసింది. గురువారం నుంచి లీటరుకు రెండు రూపాయలు పెరగనున్నట్టు ప్రకటించింది.
అక్కిరెడ్డిపాలెం, మార్చి 15: విశాఖ డెయిరీ యాజమాన్యం పాల అమ్మకం ధరను మరోమారు పెంచేసింది. గురువారం నుంచి లీటరుకు రెండు రూపాయలు పెరగనున్నట్టు ప్రకటించింది. టోన్డు మిల్క్ (500 ఎంఎల్) ధర రూ.26 నుంచి రూ.27కు, డబుల్ టోన్డు (500 ఎంఎల్) రూ.24 నుంచి రూ.25కు, గంగా (500 ఎంఎల్) రూ.27 నుంచి 28 రూపాయలకు, పుల్ క్రీమ్ పాలు (అర లీటరు) రూ.30 నుంచి 32 రూపాయలకు పెంచింది. గత ఏడాది ఆగస్టు 16న లీటరుకు రెండు రూపాయలు పెంచిన డెయిరీ యాజమాన్యం ఏడు నెలలకే మరొకసారి రెండు రూపాయలు పెంచి వినియోగదారులపై అదనపు భారాన్ని మోపింది.
పాల సేకరణ ధరను పెంచడం వల్లనే విక్రయ ధరను పెంచవలసి వచ్చిందని విశాఖ డెయిరీ ఎండీ ఎస్.వి.రమణ తెలిపారు. పశువుల దాణాతో పాటు ఇతర ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ఈనెల ప్రారంభం నుంచి పాడి రైతులకు ఆవు పాలైతే లీటరుకు రెండు రూపాయలు, గేదె పాలకు 4 రూపాయలు పెంచినట్టు తెలిపారు. పాల సేకరణ ధరతో పాటు ఇతర వస్తువుల ధరలు పెరగడం వల్లనే అమ్మకం ధరను పెంచవలసి వచ్చిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు డెయిరీలు పాల ధరను పెంచాయని ఆయన తెలిపారు.
Updated Date - 2023-03-16T00:27:39+05:30 IST