మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
ABN, First Publish Date - 2023-09-21T22:54:44+05:30
సీపీఐ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టామని అదనపు ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. గురువారం రాళ్లగెడ్డ ఆర్ముడ్ అవుట్ పోస్టు(ఏవోపీ)ను ఆయన సందర్శించారు.
డ్రోన్ కెమెరాలతో పరిశీలన, గాలింపు చర్యలు ముమ్మరం
అదనపు ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్
చింతపల్లి, సెప్టెంబరు 21: సీపీఐ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టామని అదనపు ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. గురువారం రాళ్లగెడ్డ ఆర్ముడ్ అవుట్ పోస్టు(ఏవోపీ)ను ఆయన సందర్శించారు. ఏవోపీ నుంచి మావోయిస్టు కంచుకోటగా పేరొందిన బలపం పంచాయతీ పరిసర శివారు గ్రామాలు, సరిహద్దు అడవులను డ్రోన్ కెమెరాతో ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం సీఆర్పీఎఫ్ జవాన్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. బలపం పంచాయతీ శివారు గ్రామాల్లో ఒడిశాకు అనుకుని ఉండడంతో మావోయిస్టులు చొరబడే అవకాశముందని తెలిపారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తూ ముందుకు సాగాలన్నారు. మావోయిస్టులు ఆంధ్రలోకి చొరబడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని ఆదేశించారు. మావోయిస్టుల వల్ల ప్రభుత్వ అస్తులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. ప్రస్తుతం సరిహద్దు అడవుల్లో గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రధాన కేంద్రాల్లో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తూ ప్రధాన రహదారులు, కూడళ్లలో బాంబ్ స్క్వాడ్ బృందాలు సోదాలు చేస్తున్నాయన్నారు. వారోత్సవాల వల్ల గిరిజన ప్రాంత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారన్నారు. ఆదివాసీలు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ మావోయిస్టులకు సహకరించవద్దని సూచించారు. ఆయన వెంట స్థానిక సీఐ కె.రమేశ్, సీఆర్పీఎఫ్ అధికారులు వున్నారు.
Updated Date - 2023-09-21T22:54:44+05:30 IST