వచ్చే నెల 2, 3 తేదీల్లో సింహ‘గిరి ప్రదక్షిణ’
ABN, First Publish Date - 2023-06-03T01:12:03+05:30
వచ్చే నెల 2, 3 తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
ఏర్పాట్లపై ఈవో సమావేశం
సింహాచలం, జూన్ 2:
వచ్చే నెల 2, 3 తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఏటా ఆషాడ పూర్ణిమ నాడు భక్తులు సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ ఏడాది ఉత్సవ నిర్వహణపై ఈఓ శుక్రవారం సింహగిరిపై దేవస్థానం పాలక మండలి సభ్యులు, వివిధ విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవంలో తిరుగు పుష్పతేరు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలయ పౌర్ణమి ప్రదక్షిణలను పురస్కరించుకుని జూలై మూడో తేదీన చేయాల్సిన పుష్పాలంకరణ వంటి వాటిపై చర్చించారు. భక్తులు రెండో తేదీ మధ్యాహ్నం/సాయంత్రం నుంచి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర భక్తులకు కనీస సదుపాయాల కల్పించాలని నిర్ణయించారు. శాంతి భద్రతలకు సంబంధించి పోలీస్ శాఖకు, వైద్య సాయం కోసం సంబంధిత శాఖ అధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో భక్తులకు విస్తృత సేవలు అందించే విధంగా కృషిచేయాలని ఈవో సూచించారు. ఈ సమావేశంలో దేవస్థానం ఈఈలు డీజీ శ్రీనివాసరాజు, బి.రాంబాబు, ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టీపీ రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పాలక మండలి సభ్యులు, పలువురు దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-03T01:12:03+05:30 IST