భీమడోలులో ప్రమాదంతో పలు రైళ్లు ఆలస్యం
ABN, First Publish Date - 2023-03-31T01:16:55+05:30
ఏలూరు జిల్లా భీమడోలు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో విజయవాడ వైపు నుంచి వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):
ఏలూరు జిల్లా భీమడోలు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో విజయవాడ వైపు నుంచి వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. భీమడోలు వద్ద తెల్లవారు జాము మూడు గంటల సమయంలో టాటా ఏస్ వాహనం పట్టాలపైకి వచ్చి నిలిచిపోయింది. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ రైలు దానిని బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. రైలు ఇంజన్ పాడైపోవడంతో మరొకటి తెప్పించి, మార్గాన్ని క్లియర్ చేసి మిగిలిన రైళ్లకు క్లియరెన్స్ ఇచ్చారు. దాంతో దురంతో ఎక్స్ప్రెస్ రైలు షెడ్యూల్ ప్రకారం ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకోవలసి ఉండగా, మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చింది. దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమైంది. అందులో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే హైదరాబాద్-విశాఖపట్నం గరీభ్రథ్ రైలు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. చెన్నై-హౌరా మెయిన్ రెండు గంటలు, గంటూరు-విశాఖపట్నం-రాయగడ పాసింజర్ నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చాయి. విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలు కూడా గంట ఆలస్యమైంది.
Updated Date - 2023-03-31T01:16:55+05:30 IST