భూ మాఫియా బారి నుంచి రక్షించండి మహాప్రభో!
ABN, First Publish Date - 2023-04-03T01:08:11+05:30
భూ మాఫియా బారి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ అనంతగిరి మండలం నాన్ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. తమకు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు న్యాయం చేయాలంటూ మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి వేడుకుంటున్నారు. మండల గిరిజన సంఘం, సీఐటీయూ నాయకులతో కలిసి గిరిజనులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపి అనంతరం విలేఖరులకు తమ గోడు వెలిబుచ్చారు.
- మా భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు
- కలెక్టర్, ఎస్టీ కమిషన్ చైర్మన్ న్యాయం చేయాలి
- నాన్ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజనుల వేడుకోలు
అరకులోయ, ఏప్రిల్ 2: భూ మాఫియా బారి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ అనంతగిరి మండలం నాన్ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. తమకు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు న్యాయం చేయాలంటూ మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి వేడుకుంటున్నారు. మండల గిరిజన సంఘం, సీఐటీయూ నాయకులతో కలిసి గిరిజనులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపి అనంతరం విలేఖరులకు తమ గోడు వెలిబుచ్చారు. భూ మాఫియా తమ భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ చినకూనెల రెవెన్యూ పరిధిలో 1 నుంచి 6 సర్వే నంబర్ వరకు ఉన్న 30 ఎకరాలు జిరాయితీ భూమి, బూరిగ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 1 నుంచి 12 వరకు 90 ఎకరాల జిరాయితీ భూమిలో మొత్తం 112 కుటుంబాలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ భూములకు సంబంధించి తమకు తెలియకుండా రికార్డుల్లో మార్పులు చేశారని, దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ భూములు తమకు దక్కకుండా కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ బూరిగ, చినకూనెల గ్రామాలకు చెందిన రైతులు, గిరిజన సంఘం, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-03T01:08:11+05:30 IST