లోపభూయిష్టంగా సమగ్ర భూ రీసర్వే
ABN, First Publish Date - 2023-01-15T01:00:00+05:30
సమగ్ర భూ రీ సర్వే సమయాన్ని కుదించడంతో సర్వే లోపభూయిష్టంగా జరుగుతున్నదని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు ఈర్లె శ్రీరామ్మూర్తి విమర్శించారు.
బుచ్చెయ్యపేట, జనవరి 14: సమగ్ర భూ రీ సర్వే సమయాన్ని కుదించడంతో సర్వే లోపభూయిష్టంగా జరుగుతున్నదని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు ఈర్లె శ్రీరామ్మూర్తి విమర్శించారు. శనివారం ఆయన పి.భీమవరంలో విలేకరులతో మాట్లాడారు. తొలుత 200 ఎకరాల గల రెవెన్యూ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆరు నెలల కాలంలో భూ సర్వే చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం రెండు నెలల్లో భూ రీసర్వే పూర్తి చేయాలనుకోవడంతో పథకం లక్ష్యం దెబ్బతింటుందన్నారు. సర్వే పారదర్శకంగా జరగడానికి ఆరు నెలల వ్యవధిని ఇవ్వాలన్నారు. సర్వేకు తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో రెవెన్యూ ఉద్యోగులకు ఆర్థిక భారాన్ని మిగులుస్తుందన్నారు. జీతాలు సకాలంలో రాక ఇబ్బంది పడుతున్న రెవెన్యూ ఉద్యోగులు భూ రీసర్వేతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. సర్వే జరిగినాడే రాళ్లు పాతేలా చర్యలు చేపట్టాలన్నారు. సర్వే ఒకసారి, రాళ్లు పాతడం మరోసారి అయితే సమస్యలు ఉత్పన్నం కాగలవని ఆందోళన వ్యక్తంచేశారు. సర్వేకు ప్రత్యేకంగా రెవెన్యూ ఉద్యోగుల బృందాలను నియమించాలన్నారు ప్రభుత్వ, ప్రైవేటు భూముల సరిహద్దులను పక్కగా నిర్ధారించి, జిరాయితీ భూముల సర్వే రాళ్లను రైతుల సమక్షంలో పాతించాలన్నారు. సమగ్ర భూ రీసర్వేలో పేర్కొన్న నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలులో అధికారులు విఫలం చెందుతున్నారని ఈర్లె శ్రీరామ్మూర్తి ఆరోపించారు.
Updated Date - 2023-01-15T01:00:02+05:30 IST