మినుములూరుకు మళ్లీ గుర్తింపు
ABN, First Publish Date - 2023-04-25T01:03:48+05:30
పాడేరు మండలం మినుములూరుకు జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీగా గుర్తింపు లభించింది. ప్రతి ఏడాది ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తుంటారు. ఈ ఏడాది జిల్లాలోని పాడేరు డివిజన్లో జిల్లాస్థాయి ఉత్తమ పంచాయతీలుగా నాలుగు ఎంపికకాగా వాటిలో క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో మినుములూరు ఎంపికైంది. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవంలో సర్పంచ్ చిట్టమ్మ, కార్యదర్శి చిన్నిలకు జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, డీఎల్పీవో పీఎస్.కుమార్ అవార్డును ప్రదానం చేశారు.
జిల్లాస్థాయిలో ఉత్తమ పంచాయతీగా పురస్కారం
ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దిన పాలకవర్గం
క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో ద్వితీయ స్థానం
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పాడేరు మండలం మినుములూరుకు జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీగా గుర్తింపు లభించింది. ప్రతి ఏడాది ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తుంటారు. ఈ ఏడాది జిల్లాలోని పాడేరు డివిజన్లో జిల్లాస్థాయి ఉత్తమ పంచాయతీలుగా నాలుగు ఎంపికకాగా వాటిలో క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో మినుములూరు ఎంపికైంది. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవంలో సర్పంచ్ చిట్టమ్మ, కార్యదర్శి చిన్నిలకు జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, డీఎల్పీవో పీఎస్.కుమార్ అవార్డును ప్రదానం చేశారు.
మినుములూరు పంచాయతీ పరిధిలో మినుములూరు, కాఫీ కాలనీ, కోడిగుడ్లు, సల్దిగెడ్డ, సంగోడి గ్రామాలు వున్నాయి. మొత్తం జనాభా 2,056. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు వున్నాయి. అర్హులందరికీ సామాజిక పింఛన్ల అందుతున్నాయి. జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదిలో వంద రోజులు ఉపాధి పనులు కల్పిస్తున్నారు. గిరిజన యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాలు, వెలుగు ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందించి చిఇరువ్యాపారాలు పెట్టించారు. గతంలో నాటుసారా తయారీ కేంద్రంగా ఉన్న కోడిగుడ్లు గ్రామంలో ఇప్పుడు సారా లేకుండా చేశారు. సల్దిగెడ్డ వాసుల్లో పలువురు గంజాయి రవాణా చేసేవారు. అధికారులు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడంతో గంజాయి జోలికి వెళ్లడంలేదు. మినుములూరు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ఓఎన్జీసీ 25 కంప్యూటర్లను వితరణ చేసింది.
చెత్త నుంచి సంపద తయారీతో ప్రత్యేక గుర్తింపు
ఏజెన్సీలో ఎక్కడా లేని విధంగా మినుములూరులో మాత్రమే నాలుగేళ్లుగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2020 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టారు. మినుములూరు పరిసరాల్లో పర్యాటకులు పడవేసే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను సేకరించి సంపద కేంద్రం ద్వారా కిలో రూ.16 చొప్పున విక్రయిస్తున్నారు. 2020 జనవరి నెలలో ఢిల్లీ నుంచి ఓ ప్రత్యేక కేంద్ర బృందం ఇక్కడికి వచ్చి ఆయా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారానికి మినుములూరు పంచాయతీని ఎంపిక చేశారు. సరిగ్గా ఏడాది క్రితం పంచాయతీరాజ్ దినోత్సవం రోజున (2022 ఏప్రిల్ 24వ తేదీ) కేంద్ర ప్రభుత్వం అవార్డును, రూ.8 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఈ ఏడాది క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో జిల్లాస్థాయిలో ద్వితీయ ఉత్తమ పంచాయతీగా మినుములూరు ఎంపిక కావడం విశేషం. తమ పంచాయతీకి మరోసారి పురస్కారం లభించడం ఆనందంగా ఉందని సర్పంచ్ లంకెల చిట్టమ్మ, పంచాయతీ కార్యదర్శి ఒల్లేసి చిన్ని ఆనందం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-04-25T01:03:48+05:30 IST