చీడిగొందిలో జ్వరాల విజృంభణ
ABN, First Publish Date - 2023-06-26T01:16:53+05:30
మండలంలోని దేవరాపల్లి పంచాయతీ చీడిగొంది గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. మూడు రోజులుగా గ్రామంలో 15 మంది జ్వరాలతో బాధపడుతుండగా, ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించాలని, నడవలేని స్థితిలో ఉన్న తాము ఆస్పత్రికి వచ్చే పరిస్థితి లేదని ఆదివాసీలు జీకేవీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెండు రోజుల క్రితం సమాచారం పంపించినప్పటికి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం గ్రామంలో ఆదివాసీలు మంచానపడి మృత్యువుతో పోరాడుతున్నారు.
- 15 మందికి అనారోగ్యం.. ఆరుగురి పరిస్థితి విషమం
- జాడలేని వైద్య సిబ్బంది
- పీహెచ్సీకి సమాచారమిచ్చినా స్పందన కరువు
గూడెంకొత్తవీధి, జూన్ 25: మండలంలోని దేవరాపల్లి పంచాయతీ చీడిగొంది గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. మూడు రోజులుగా గ్రామంలో 15 మంది జ్వరాలతో బాధపడుతుండగా, ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించాలని, నడవలేని స్థితిలో ఉన్న తాము ఆస్పత్రికి వచ్చే పరిస్థితి లేదని ఆదివాసీలు జీకేవీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెండు రోజుల క్రితం సమాచారం పంపించినప్పటికి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం గ్రామంలో ఆదివాసీలు మంచానపడి మృత్యువుతో పోరాడుతున్నారు.
వర్షాలు ప్రారంభంకాగానే గిరిజన గ్రామాల్లో మలేరియా, వైరల్, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలుతుంటాయి. గ్రామాల్లో వ్యాధులు ప్రబలాయని సమాచారం వచ్చిన వెంటనే వైద్యసిబ్బంది ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందిస్తుంటారు. తాజాగా వైద్య ఆరోగ్యశాఖలో విభిన్నమైన మార్పులు వచ్చాయి. ఆస్పత్రికి ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికి మైదాన ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ ఆస్పత్రిలో వచ్చే ఓపీకి మాత్రమే పరిమితమవుతున్నారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాల జాడ కనిపించడం లేదు. ఫ్యామిలీ ఫిజీషియన్ అంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని ప్రభుత్వ అధికారుల ప్రకటనలు ఎక్కడా ఆచరణకు నోచుకోవడం లేదు. చీడిగొంది గ్రామంలో వారం రోజుల కిందట ఇద్దరికి చలితో కూడిన జ్వరం వచ్చింది. గురువారం నాటికి గ్రామంలో పది మంది చలి జ్వరాలతో బాధపడుతున్నారు. ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సమాచారాన్ని స్థానిక గిరిజనులు జీకేవీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు పారామెడికల్ సిబ్బంది సైతం గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. చీడిగొంది నుంచి జీకేవీధికి వచ్చేందుకు సరైన రహదారి సదుపాయం లేనందున ఆదివాసీ రోగులను ఆస్పత్రికి వాహనాల్లో తరలించే పరిస్థితి లేదు. దీంతో ఆదివాసీలు నాటు వైద్యం చేసుకుంటూ సర్కారు వైద్యం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వైద్య సిబ్బంది గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదు. గ్రామంలో రెండేళ్ల బాలుడు యోహాను, నాలుగేళ్ల హమేసుతోపాటు గెమ్మెల సీతమ్మ, సలోమి, ఝాన్సీ, తులసీల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఆరుగురితో పాటు మరో తొమ్మిది మంది జ్వరాలతో బాధపడుతున్నారు. సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోతే మరణాలు సంభవించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి ఆదివాసీలకు మెరుగైన చికిత్స అందించాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - 2023-06-26T01:16:53+05:30 IST