ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-09-09T01:43:22+05:30
నగర పరిధిలోని బోయపాలెంలో గల ఎన్ఆర్ఐ కళా శాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మీసాల రమ్య శుక్రవారం హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలిది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం
ఎండాడలో కళాశాల ఏర్పాటుకు అనుమతులు... కానీ బోయపాలెంలో నిర్వహణ
గుర్తించిన ఇంటర్మీడియ్ బోర్డు అధికారులు
యాజమాన్యానికి షోకాజ్
విశాఖపట్నం/కొమ్మాది, సెప్టెంబరు 8:
నగర పరిధిలోని బోయపాలెంలో గల ఎన్ఆర్ఐ కళా శాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మీసాల రమ్య శుక్రవారం హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. పీఎం పాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు... విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కరకాం గ్రామానికి చెందిన మీసాల శ్రీను కుమార్తె ఎం.రమ్య బోయపాలెం వద్ద గల ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల వసతిగృహంలో ఉంటూ ఇంటర్ చదువుతోంది. ఇటీవల కళాశాలకు పది రోజులు హోమ్ సిక్ సెలవులు ఇవ్వడంతో స్వగ్రామానికి వెళ్లి, నాలుగు రోజుల కిందట తిరిగి వచ్చింది. ఆమె మేనత్త కుమార్తె కూడా అదే హాస్టల్లో ఉంటోంది. శుక్రవారం ఉదయం విద్యార్థినులంతా స్టడీ అవర్కు బయలుదేరుతున్న సమయంలో తనకు కడుపునొప్పిగా ఉందని, రాలేనని చెప్పి రమ్య హాస్టల్లోనే ఉండిపోయింది. మిగిలిన వారంతా స్టడీ అవర్ పూర్తిచేసుకుని తిరిగి హాస్టల్ గదికి వచ్చేసరికి రమ్య సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. భయాందోళనకు గురైన విద్యార్థినులు విషయాన్ని కళాశాల నిర్వాహకులకు తెలియజేయడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని సీఐ వివరించారు.
కళాశాలను తనిఖీ చేసిన అధికారులు
విద్యార్థిని ఆత్మహత్య సమాచారం తెలిసి ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలను తనిఖీ చేసినప్పుడు పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు బోయపాలెంలో ఎన్ఆర్ఐ కళాశాల, హాస్టల్ నిర్వహణకు అనుమతి లేదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఎండాడలో కళాశాల నిర్వహణకు అనుమతి తీసుకుని బోయపాలెంలో నడుపు తున్నట్టు తేలింది. కళాశాలను తరలించాలనుకుంటే ఇంటర్ బోర్డు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ, ఎటువంటి అనుమతి లేకుండా బోయపాలెంలో కళాశాల ఏర్పాటుచేయడంతోపాటు హాస్టల్ నిర్వహించడాన్ని బోర్డు అధికారులు తీవ్రంగా పరిగణిస్తూ యాజమాన్యానికి ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఆర్.సత్యనారాయణ షోకాజ్ నోటీస్ జారీచేశారు. అయితే బోర్డులో కొందరు అధికారులు, సిబ్బంది అండతోనే కళాశాలను ఎండాడ నుంచి బోయ పాలెం తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు వంటి విషయాల్లో ప్రైవేటు కళాశాలల నుంచి ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో కొందరు భారీగా ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై మరింత లోతుగా విచారణ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే బాలిక తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కళాశాలకు షోకాజ్ నోటీస్ జారీచేశామని, యాజమాన్యం నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటా యన్నారు.
ఇటీవల కాలంలో నగరంలోని ప్రైవేటు జూనియర్ కళా శాలల్లో ఇద్దరు బాలికలు మృతిచెందారు. ‘ఆకాశ్- బైజూస్’ ఆధ్వర్యంలో నరసింహనగర్లో నడుస్తున్న ‘అచీ వర్స్’ చదువుకుంటున్న పశ్చిమ బెంగాల్కు చెందిన రితీ సాహ దొండపర్తిలో గల సాధన హాస్టల్ భవనం పైనుంచి పడి మృతిచెందింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జోక్యంతో అక్కడ సీఐడీ అధికారులు వచ్చి విచారణ జరిపారు. ఈ కేసులో నలుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు.
Updated Date - 2023-09-09T01:43:24+05:30 IST