రెవెన్యూ తీరుపై జనాగ్రహం
ABN, First Publish Date - 2023-01-26T01:08:41+05:30
అనకాపల్లి మండల రెవెన్యూ అధికారులు ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, కార్యా లయం చుట్టూ తిప్పించు కుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం
తహసీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
ఉదయం నుంచి రాత్రి వరకు నిరీక్షణ
అయినా అధికారులు కనికరించలేదని ఆవేదన
ముఖ్యమైన సమావేశం ఉందంటూ తలుపులు మూసివేత
తుమ్మపాల, జనవరి 25: అనకాపల్లి మండల రెవెన్యూ అధికారులు ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, కార్యా లయం చుట్టూ తిప్పించు కుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం గతంలో దరఖాస్తు చేసిన వారిలో పలువురు బుధవారం ఉదయం మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐలు కార్యాలయానికి రాలేదని వారు చెబుతున్నారు. తిండి తిప్పలు లేకుండా సాయంత్రం వరకు కార్యాలయం వద్ద పడిగాపులు కాశామని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు సహనం నశించి కిందిస్థాయి సిబ్బందిని నిలదీయగా, కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ తమపై కేకలు వేశారని వారు ఆరోపించారు. కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని మహిళలు వాపోయారు. ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగు తున్నదని, పనులు మానుకుని కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరగాల్సి వస్తున్నదని దరఖాస్తుదారులు తమ బాధను వ్యక్తం చేశారు. సాయంత్రం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినప్పటికీ, అధికారులకు ముఖ్యమైన సమావేశం వుందంటూ కార్యాలయం తలుపులు మూసేశారని ఆవేదన చెందారు. ఉన్నతాధికారులు స్పందించి కుల, ఆదాయ, ఇతర ధ్రువపత్రాలు సకాంలో జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరారు.
Updated Date - 2023-01-26T01:08:56+05:30 IST