14వ రోజు... మరింత జోరు!
ABN, First Publish Date - 2023-09-27T01:11:49+05:30
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. రిలే నిరాహార దీక్షలు వరుసగా 14వ రోజు కూడా కొనసాగాయి. ‘బాబుతో నేను’ పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన తీరును ప్రజలకు వివరించారు. సాయంత్రం తరువాత పలుచోట్ల కాగడాలు, కొవ్వుత్తులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొనసాగుతున్న నిరాహార దీక్షలు
కొవ్వుత్తులు, కాగడాలతో ర్యాలీలు
‘బాబుతో నేను’ అంటూ ఇంటింటి ప్రచారం
చంద్రబాబుకు బెయిల్ కోసం ఆలయాల్లో పూజలు
(ఆంధ్రజ్యోతి- న్యూస్ నెట్వర్క్)
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. రిలే నిరాహార దీక్షలు వరుసగా 14వ రోజు కూడా కొనసాగాయి. ‘బాబుతో నేను’ పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన తీరును ప్రజలకు వివరించారు. సాయంత్రం తరువాత పలుచోట్ల కాగడాలు, కొవ్వుత్తులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
చంద్రబాబుకు సత్వరమే బెయిల్ లభించాలని కోరుతూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, పలువురు నాయకులు సింహాచలం వెళ్లి వరాహ లక్ష్మీనృసింహస్వామికి పూజలు చేశారు. గాలిగోపురం వద్ద మోకాళ్లపై కూర్చొని చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని స్వామిని వేడుకున్నారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పరవాడలో సినిమాహాల్ జంక్షన్ సంతబయలు వరకు నిరసన ర్యాలీ చేశారు. అంతకుముందు సినిమాహాల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన దీక్ష శిబిరంలో బండారు మాట్లాడుతూ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధులు దుర్వినియోగం అయినట్టు సీఐడీ అధికారులు ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారని అన్నారు. అయినప్పటికీ చంద్రబాబుపై కక్షగట్టి అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం సీఎం జగన్ సైకో పాలనకు అద్దం పడుతున్నదన్నారు. మాజీ ఎంపీపీలు మాసవరపు అప్పలనాయుడు, పైలా జగన్నాథరావు, మాదంశెట్టి నీలబాబు, తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం కొత్తఎల్లవరంలో పంచాయతీ సర్పంచ్ కొల్లి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన నాయకులతోపాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబుకు త్వరగా బెయిల్ లభించాలని కోరుతూ మరిడమ్మతల్లి ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి 109 కొబ్బరికాయలు కొట్టారు. మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామంలో పంచాయతీ సర్పంచ్ పోతల రామలక్ష్మి, నర్సీపట్నం ఏఎంసీ మాజీ చైర్మన్ పోతల అప్పలనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. సైకో సీఎం పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం రామాలయంలో పూజలు నిర్వహించారు.
ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లిలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లె నానాజీ ఆధ్వర్యంలో, పట్టణంలోని 24, 25 వార్డుల్లో క్లస్టర్ ఇన్చార్జ్ ఆడారి ఆదిమూర్తి, టీడీపీ కార్యదర్శి ఆడారి రమణబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ఇంటింటా ప్రచారం చేశారు. ‘బాబుతో నేను’ అని ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఎలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి, పంచదార్ల గ్రామాల్లో మంగళవారం రాత్రి టీడీపీ మండల అధ్యక్షుడు వి.దిన్బాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. పోలీస్టేషన్ సమీపంలో మోకాళ్లపై నిలుచొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు ఆధ్వర్యంలో బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన వైసీపీ పాలకులు రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే రాజు, సీనియర్ నేత గునూరు మల్లునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
మాడుగుల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి పీవీజీకుమార్ ఆధ్వర్యంలో మాడుగులో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుపట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను వ్యతిరేకిస్తూ మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్మోహన్రెడ్డి కక్షపూరితంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కొద్ది రోజుల్లోనే చంద్రబాబునాయుడు మచ్చలేని మనిషిగా జైలు నుంచి బయటకు రావడం, ఎన్నికల తరువాత జగన్రెడ్డి అండ్ కో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత పైలా ప్రసాదరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
పాయకరావుపేటలో టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో ‘బాబుతో నేను’ పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. చాకలిపేట, ఏటిఒడ్డు వీధి తదితర ప్రాంతాల్లో కరపత్రాలను పంపిణీ చేశారు. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామంలో మంగళవారం రాత్రి టీడీపీ మండల అధ్యక్షుడు జానకి శ్రీనివాసరావు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు.
Updated Date - 2023-09-27T01:11:49+05:30 IST