చిట్టీల పేరుతో చీటింగ్
ABN, First Publish Date - 2023-07-21T01:13:11+05:30
అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన ఓ మహిళ చిట్టీల పేరుతో కోటి రూపాయలకుపైగా వసూలు చేసి పరారైంది. ఆమె చేతిలో మోసపోయిన బాధితులు గురువారం రాత్రి అనకాపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలు కాపుశెట్టి కల్యాణి, ఎ.చంద్రకళ, ఆర్.దుర్గ, చిన్నతల్లి, కల్పన తదితరులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
రూ.కోటితో ఉడాయించిన మహిళ
విజయవాడ వెళుతున్నట్టు చెప్పి తిరిగిరాని వైనం
పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు
కొత్తూరు, జూలై 20: అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన ఓ మహిళ చిట్టీల పేరుతో కోటి రూపాయలకుపైగా వసూలు చేసి పరారైంది. ఆమె చేతిలో మోసపోయిన బాధితులు గురువారం రాత్రి అనకాపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలు కాపుశెట్టి కల్యాణి, ఎ.చంద్రకళ, ఆర్.దుర్గ, చిన్నతల్లి, కల్పన తదితరులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
అనకాపల్లి మండలం రేబాక గ్రామం గురజాడ నగర్ కాలనీకి చెందిన మొల్లి వరలక్ష్మి గత మూడేళ్ల నుంచి చిట్టీలు నిర్వహిస్తున్నది. నెలకు రూ.5 వేల చొప్పున 20 నెలలకు లక్ష రూపాయలు, నెలకు రూ.5 వేల చొప్పున రెండేళ్లకు రూ.1.2 లక్షలు, ఇంకా రూ.50 వేల చీటీలు నిర్వహిస్తున్నది. స్థానికురాలు కావడంతో ఆమెపై నమ్మకంతో గురజాడ నగర్తోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ఆమె వద్ద చిట్టీలు కట్టారు. ప్రస్తుతం ఆమె వద్ద సుమారు 70 మంది చిట్టీలు వేశారు. చిట్టీలు పాడుకున్న వారికి సక్రమంగా డబ్బులు చెల్లించడంలేదు. మొత్తం మీద చిట్టీలు పాడుకున్న వారికి, పాడుకోని వారికి కలిపి కోటి రూపాయల వరకు చెల్లించాల్సి వుందని చెబుతున్నారు. డబ్బులు అడిగితే రేపు.. మాపు అంటూ నెట్టుకొస్తున్నది. ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కుదరడం లేదని చెబుతూ ఈ నెల 18వ తేదీన విజయవాడ వెళుతున్నట్టు చెప్పింది. దీంతో నిజమేనని భావించారు. కానీ కొంతమందికి అనుమానంగా వుంది. గురువారం సాయంత్రం వరకు ఆమె విజయవాడ నుంచి తిరిగి రాకపోవడంతో ఇంటికి వెళ్లి ఆమె అల్లుడు దుర్గారావును నిలదీశారు. అతను సరైన సమాధానం చెప్పకపోవడంతో అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా గొలగాం గ్రామానికి చెందిన సలపురెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తి చిట్టీల విషయంలో వరలక్ష్మికి సహకరిస్తుంటాడని, ఇప్పుడు అతను కూడా కనిపించడం లేదని బాధితులు వాపోయారు. ఆయనపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధిత మహిళలు తెలిపారు.
Updated Date - 2023-07-21T01:13:11+05:30 IST