రిజిస్ట్రేషన్స్కు కార్డ్ 2.0
ABN, First Publish Date - 2023-10-25T01:39:44+05:30
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో మొండి పట్టుదలకు పోతోంది.
ఈ నెల 28 నుంచి ప్రారంభించాల్సిందిగా సర్కారు ఆదేశం
సాఫ్ట్వేర్ సహకరించకున్నా అమలు చేయాలని ఒత్తిళ్లు
చలానా అప్లోడ్ కాదు..కలర్ ప్రింటర్లు లేవు
..అయినా రోజుకు కనీసం 10 డాక్యుమెంట్లు ఉండాలని సూచన
ఎప్పటిలాగే డాక్యుమెంట్లే సమర్పిస్తామని రైటర్ల వెల్లడి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో మొండి పట్టుదలకు పోతోంది. ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్లను రాసుకునే విధానం తీసేసి, ‘కార్డ్ 2.0’ అంటూ కొత్త విధానం తీసుకువస్తోంది. చేతితో నచ్చిన అంశాలు రాసుకునే వెసులుబాటు ఇందులో ఉండదు. ప్రభుత్వం రూపొందించిన పబ్లిక్ డేటాలో ఏదో ఒక డాక్యుమెంట్ మాత్రమే ఎంచుకుని దాని ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాటిలో అన్నీ ఖాళీలు ఉంటాయి. అమ్మకందారు పేరు, ఆస్తి వివరాలు, దిక్కులు, హద్దులు, విలువ ఇలా ఖాళీలు పూరించి అందజేస్తే డాక్యుమెంట్ ప్రింట్ ఇస్తారు. అందులో స్టాంప్ పేపర్ ఊసే ఉండదు. రిజిస్ట్రేషన్ల శాఖ పేరుతో రూపొందించిన ఒక కలర్ లోగో మాత్రమే ఉంటుంది. దాని కింద రిజిస్ట్రేషన్ వివరాలు ఉంటాయి. ఈ విధానాన్ని ఆ శాఖకు చెందిన అధికారులతో పాటు డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రభుత్వం దీనిని సమర్థిస్తూ ఈ నెల 24వ తేదీ నుంచి అమలు చేయాలని ముందు ఆదేశించింది. సెలవు రోజు కావడంతో 28వ తేదీ నుంచి ప్రారంభించాలని సూచించింది.
లోపాలు అనేకం
- ఈ విధానంలో సాఫ్ట్వేర్ అప్డేట్గా లేదు. ఏ కార్యాలయంలోను ఇది పూర్తిగా ఓపెన్ కావడం లేదు.
- డేటా ఎంట్రీలో చలానాలు అప్లోడ్ కావడం లేదు. అవే చాలా కీలకం. కక్షిదారులు ఫీజులు కింద ఎంత మొత్తం చెల్లించారనేది చలానాలో ఉంటుంది. అది అప్లోడ్ కాకపోతే ఆ ప్రక్రియ పూర్తికాదు.
- కొత్త విధానంలో డాక్యుమెంట్ ప్రింట్ చేసి ఇవ్వాలంటే కలర్ ప్రింటర్ ఉండాలి. ఇప్పటివరకూ వీటిని పంపిణీ చేయలేదు. వీటికి చాలా ఖర్చు అవుతుంది. ఇంక్ రీఫిల్స్ కూడా భారీ సంఖ్యలో ఇవ్వాల్సి ఉంటుంది. అవేవీ ఇవ్వకుండా మొదలెట్టాల్సిందిగా చెప్పడం దేనికి సంకేతమో ఉన్నతాధికారులు చెప్పలేకపోతున్నారు. అవినీతిని తగ్గించడానికి ఈ విధానం అని చెప్పి...అవసరమైనవి సమకూర్చకుండా సబ్ రిజిస్ట్రార్లపై ఆర్థిక భారం మోపుతున్నారు. ఇది మళ్లీ వసూళ్లకే దారితీస్తుందనే విషయం విస్మరిస్తున్నారు.
- ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ల సమాచారం అంతా ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) వద్ద ఉండేది. ఇప్పుడు ఆ డేటాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఆ సంస్థే రూ.30 కోట్ల కాంట్రాక్టుతో 2.0 సాఫ్ట్వేర్ తయారుచేసింది. ఎన్నికలకు ముందే దీనిని అమలు చేయాలని ఒత్తిడి పెడుతున్నారు.
మధురవాడ, ఆర్ఓ వంటి కార్యాలయాల్లో రోజుకు 30 నుంచి 40 డాక్యుమెంట్లు రిజిస్టర్ చేస్తారు. అలాంటి చోట ఈ నెల 28 నుంచి రోజుకు కనీసం 10 డాక్యుమెంట్లు కొత్త విధానంలో చేయాలని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లకు నచ్చజెప్పాలని కోరుతున్నారు.
మేము సహకరించం
డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్
కార్డ్ 2.0 విధానానికి మేము సహకరించబోం. కార్యాలయం సిబ్బంది చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు మాతో చేయించాలని చూస్తున్నారు. మేమే కంప్యూటర్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేసి, చెక్ లిస్ట్ పెట్టి తీసుకువెళ్లి ఇస్తే..వాళ్లు సంతకం చేస్తారట. దానికే మళ్లీ మేము డబ్బులు వసూలు చేసి ఇవ్వాలి. ఇప్పుడు మేము కంప్యూటర్లు కొనుక్కోవాలి. ఆన్లైన్లో చేయడం అన్నీ నేర్చుకోవాలి. ఎప్పటిలాగే రాసిన డాక్యుమెంట్లు సమర్పిస్తాం. చేయకపోతే..అలా రాసివ్వాల్సిందిగా అడుగుతాము. కక్షిదారులు ఈ విధానానికి సుముఖత చూపడం లేదు. ఇప్పుడున్న విధానమే బాగుంది. దానినే కొనసాగించాలి.
Updated Date - 2023-10-25T01:39:44+05:30 IST