వ్యాపారుల్లో గుబులు
ABN, First Publish Date - 2023-03-02T01:05:14+05:30
రెవెన్యూ సిబ్బంది బుధవారం స్థానిక మార్కెట్ సెంటర్లోని దుకాణాలు, లాడ్జీల వివరాలు సేకరిస్తుండడంతో స్థానిక వర్తకులు, లాడ్జీల నిర్వాహకులు ఆందోళన చెందారు. స్థానిక మార్కెట్లోని దుకాణాల వివరాలను వర్తకులు, యజమానులు సచివాలయానికి వచ్చి ఆర్ఐకి అంద జేయాలని వాట్సప్ గ్రూప్ల్లో మెసేజ్ రావడంతో వారంతా టెన్షన్ పడ్డారు.
- రెవెన్యూ సిబ్బంది దుకాణాల వివరాలు సేకరిస్తుండడంపై ఆందోళన
- పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు కోసం తొలగిస్తారేమోనని టెన్షన్
సీలేరు, మార్చి 1: రెవెన్యూ సిబ్బంది బుధవారం స్థానిక మార్కెట్ సెంటర్లోని దుకాణాలు, లాడ్జీల వివరాలు సేకరిస్తుండడంతో స్థానిక వర్తకులు, లాడ్జీల నిర్వాహకులు ఆందోళన చెందారు. స్థానిక మార్కెట్లోని దుకాణాల వివరాలను వర్తకులు, యజమానులు సచివాలయానికి వచ్చి ఆర్ఐకి అంద జేయాలని వాట్సప్ గ్రూప్ల్లో మెసేజ్ రావడంతో వారంతా టెన్షన్ పడ్డారు.
ఇప్పటికే సీలేరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించేందుకు గ్రామంలో కొంత భాగం పోతుందని, ముఖ్యంగా మార్కెట్ సెంటర్ పోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వర్తకుల్లో ఆందోళన మొదలైంది. జీకే వీధి మండలంలో 1964లో సీలేరు ప్రాజెక్టు నిర్మాణం జరిగే సమయంలో వివిధ పనుల నిమిత్తంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారు. వీరిలో కొంత మంది ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చేరగా, మరికొంత మంది వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తూ అప్పటి నుంచి ఇక్కడే స్థిరపడ్డారు. వ్యాపారాలపై ఆధారపడిన వారికి అప్పట్లో ఏపీఎస్ఈబీ అధికారులు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రాంతంలో కొంత స్థలాన్ని కేటాయించారు. దీంతో వీరంతా ఆ ప్రాంతంలో దుకాణాలతో పాటు నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇందులో గిరిజనులు, గిరిజనేతరులు కూడా ఉన్నారు. అయితే సీలేరులో ప్రతిపాదిత పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుకు అనుమతులు వచ్చి పనులు ప్రారంభిస్తే సీలేరు మార్కెట్ అంతా ఖాళీ చేయాల్సి ఉంటుందన్న పుకార్లు గత ఏడాదిగా సీలేరులో హల్చల్ చేస్తున్నాయి. ప్రాజెక్టు సర్వే అనంతరం సర్వే రాళ్లు కూడా మార్కెట్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న 7వ క్రాస్ రోడ్డు పంచాయతీ కార్యాలయం సమీపంలో వేయడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుపై ఏప్రిల్ ఒకటన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండడంతో పాటు రెవెన్యూ సిబ్బంది సీలేరులో దుకాణాల వివరాలు సేకరిస్తుండడంతో స్థానికులు టెన్షన్కు గురవుతున్నారు. ఆర్ఐ, వీఆర్వోలను స్థానికులు దేని కోసం వివరాలు సేకరిస్తున్నారని అడగ్గా తహసీల్దార్ ఆదేశాల మేరకు చేస్తున్నామని చెబుతున్నారు. దీనిపై జీకేవీధి తహసీల్దార్ రాజ్కుమార్ను స్థానిక విలేఖరులు వివరణ కోరగా సీలేరులోని దుకాణాలు, లాడ్జీల వివరాలు సేకరిస్తున్నదని పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు కోసం కాదని తెలిపారు. ఇటీవల స్పందన కార్యక్రమంలో సీలేరు షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో గిరిజనేతరులు దుకాణాలు, లాడ్జీలు నిర్మించుకున్నారని ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివరాలు సేకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2023-03-02T01:05:14+05:30 IST