జీలుగు కల్లు కేసులో నిందితుడి అరెస్టు
ABN, First Publish Date - 2023-02-14T00:57:26+05:30
గూడెంకొత్తవీధి మండలం ఆకులూరు గ్రామంలో జీలుగు కల్లులో విషపూరిత కాయలు కలిపి ఓ వ్యక్తి మృతికి కారకుడైన నిందితుడిని అరెస్టు చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపారు.
విషపూరిత కాయలు కలపడం వల్లే ఓ వ్యక్తి మృతి చెందినట్టు నిర్ధారణ
ఆకులూరు కేసును ఛేదించిన జీకేవీధి పోలీసులు
చింతపల్లి, ఫిబ్రవరి 13: గూడెంకొత్తవీధి మండలం ఆకులూరు గ్రామంలో జీలుగు కల్లులో విషపూరిత కాయలు కలిపి ఓ వ్యక్తి మృతికి కారకుడైన నిందితుడిని అరెస్టు చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. సోమవారం చింతపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఏఎస్పీ వెల్లడించారు. ఆకులూరు గ్రామంలో మఠం సహదేవ్, త్రినాథ్ అనే అన్నదమ్ములు నివాసముంటున్నారు. వీరిద్దరూ చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి, కల్లు చెట్లను జీవనాధారంగా చేసుకుని ఇరు కుటుంబాలు జీవనం సాగిస్తూ వచ్చాయి. త్రినాథ్ మద్యానికి బానిసై వ్యవసాయ పనులు చేయకుండా బాధ్యతారహితంగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట సహదేవ్, త్రినాథ్లు తమకు ఉన్న వ్యవసాయ భూమి, కల్లు చెట్లను సమానంగా పంచుకున్నారు. అప్పటి నుంచి వీరు వేర్వేరుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. త్రినాథ్ వ్యవసాయ పనులు చేయడం మానేశాడు. తన వాటాకు వచ్చిన కల్లు చెట్ల నిర్వహణ పనులు క్రమంగా చేసుకోవడం లేదు. దీని వల్ల చెట్లు కల్లు సరిగా ఇవ్వడంలేదు. అయితే సహదేవ్ వ్యవసాయంతో పాటు కల్లు చెట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. దీంతో అతనికి ఉన్న ఒక చెట్టు బాగా కల్లు ఇస్తుంది. రెండేళ్లుగా నిరాటంకంగా కల్లు ఇవ్వడంతో అతను విక్రయించుకుని అధిక ఆదాయం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండు వారాల కిందట సహదేవ్ వద్దకు త్రినాథ్ వెళ్లి ప్రస్తుతం కల్లు ఇస్తున్న చెట్టు తనకు ఇవ్వమని అడిగాడు. దీనికి సహదేవ్ తిరస్కరించాడు. దీంతో త్రినాథ్ గొడవ పడ్డాడు. కాగా సహదేవ్ రోజూ కల్లు సేకరించి కొంత చెట్ల వద్ద సేవించి అధిక మొత్తం విక్రయానికి తీసుకు వెళుతుంటాడు.
కల్లులో విషపూరిత కాయలు కలపడంతో..
సహదేవ్పై కక్ష పెంచుకున్న త్రినాథ్ చెట్లకు ఉన్న కల్లులో విషం కలపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 5వ తేదీన గ్రామంలో గ్రామ దేవత పండగ జరుగుతుండగా గ్రామస్థులు ఆ హడావిడిలో ఉన్నారు. అదే అదనుగా భావించిన త్రినాథ్ అడవి నుంచి బుగ్గి చెట్టు పిక్కలు(విషపూరిత కాయలు) తీసుకొచ్చి, పౌడర్గా చేసి చెట్టు ఎక్కి కల్లు కుండలో కలిపాడు. మరుసటి రోజు ఉదయం సహదేవ్ యథావిధిగా కల్లు సేకరించి విక్రయానికి తీసుకొస్తుండగా అదే గ్రామానికి చెందిన పాంగి రామదాస్ మార్గమధ్యంలో అతడిని కలిశాడు. ఇంటికి ఒడిశా నుంచి బంధువులు వచ్చారని, కల్లు కావాలని చెప్పి ఐదు లీటర్లు కొనుగోలు చేశాడు. అయితే ఆ రోజు కల్లు సేకరించిన సహదేవ్ అదృష్టవశాత్తూ తాగలేదు. రామదాస్ ఇంటికి కల్లు తీసుకువెళ్లి బంధువులు, కుమారుడు లోవరాజుతో కలిసి తాగాడు. వీరిలో లోవరాజు అధిక మోతాదులో కల్లు తాగాడు. కల్లు తాగిన 15 నిమిషాలకు వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు రామదాస్, లోవరాజులను చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే లోవరాజు ఆరోగ్య పరిస్థితి విషమించి ఈ నెల 7వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామదాస్ కోలుకున్నాడు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్ సీరియస్గా తీసుకున్నారు. లోవరాజు భార్య సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఏఎస్పీ ప్రతాప్ శివకిశోర్ పర్యవేక్షణలో జీకేవీధి సీఐ అశోక్కుమార్, సీలేరు ఎస్ఐ రామకృష్ణ ఆధారాలు సేకరించి నిందితుడు త్రినాథ్ను అరెస్టు చేశారు. ఈ కేసును సకాలంలో ఛేదించిన సీఐ, ఎస్ఐని ఏఎస్పీ అభినందించారు.
Updated Date - 2023-02-14T00:57:30+05:30 IST