సీన్ లోకి వచ్చిన వసూల్ రాజా
ABN, First Publish Date - 2023-06-30T02:52:38+05:30
తిరుపతి జిల్లాలో తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చిన ఇద్దరు తహసీల్దార్ల విషయంలో అఽధికార పార్టీ ఎమ్మెల్యే పంతమే నెగ్గింది. ‘
తహసీల్దార్లపై వేటువ్యవహారం రివర్స్
సరెండరు చేసినవారికే తిరిగి పోస్టింగు
తిరుపతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చిన ఇద్దరు తహసీల్దార్ల విషయంలో అఽధికార పార్టీ ఎమ్మెల్యే పంతమే నెగ్గింది. ‘తేలిగ్గా పోవాలి’ అంటూ సీఎం పేషీకి చెందిన వసూల్రాజా నుంచి అందిన ఆదేశాలు చకచకా అమలైపోయాయి. సీసీఎల్ఏ ఆదేశాలతో కలెక్టర్కు సరెండర్ అయిన ఈ తహసీల్దార్లకు తిరిగి పోస్టింగులు వచ్చేశాయి. ఒకరి మండలానికి మరొకరిని బదిలీ చేసి సర్కారు చేతులు దులుపుకొంది. నిజానికి, తహసీల్దార్లపై చర్యలు తీసుకోకుండా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శతవిధాల ప్రయత్నించారు. సీఎం పేషీలోని అధికారులకు ఒకటికి రెండుసార్లు కలిశారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బెదిరించినా.. పని కాలేదు. ఈ దశలో సీఎం పేషీలో ఉన్నత పదవిలో ఉన్న వసూల్ రాజా రంగంలోకి దిగారు. అంతే..సీను ఒక్కసారిగా రివర్స్ అయింది. ఈ వ్యవహారంలో వసూల్ రాజాకు భారీగా ముడుపులు ముట్టినట్టు రెవిన్యూ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఏం జరిగిందంటే.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో పెద్దఎత్తున ప్రభుత్వభూములున్నాయి. వీటి ధరలు హైదరాబాద్, విజయవాడతో పోటీ పడుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అండ చూసుకుని ఏర్పేడు తహసీల్దారు ఉదయ్ సంతోష్, రేణిగుంట తహసీల్దారు శివప్రసాద్ ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా పెడచెవిన పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్కడి నుంచీ వారిని బదిలీ చేసి తిరుపతి కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం సరెండరు చేయించింది.
వసూల్ రాజా... తిరుపతి కలెక్టర్కు ఫోన్ చేసి బదిలీ అయిన తహసీల్దార్లను శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఇరుగుపొరుగు మండలాలకు మార్చి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. వారిపై తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయని, అలాంటి వారికి అక్కడే పోస్టింగులు ఇస్తే ఇతర తహసీల్దార్లపై ప్రభావం చూపుతుందని కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే వసూల్రాజా గట్టిగా ఆదేశించారు. ‘చెప్పినట్టు చేయండి అంతే’ అని కలెక్టరుకు హుకుం జారీచేసినట్టు తెలిసింది. దీంతో గత్యంతరం లేక తిరుపతి కలెక్టర్.. వసూల్రాజా ఆదేశాలను పాటించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నుంచి అందిన సిఫారసు లేఖను ప్రాతిపదికగా చేసుకుని నోడల్ అధికారి అయిన చిత్తూరు కలెక్టర్కు ప్రతిపాదన పంపినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు చిత్తూరు కలెక్టర్.. ఏర్పేడు నుంచి బదిలీ అయిన ఉదయ్ సంతో్షను రేణిగుంటకు, రేణిగుంట నుంచీ బదిలీ అయిన శివప్రసాద్ను ఏర్పేడుకు తహసీల్దార్లుగా బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏర్పేడులో 20 రోజులుగా తహసిల్దారుగా విధుల్లో వున్న ద్వారకనాథరెడ్డిని శ్రీకాళహస్తికి, రేణిగుంటలో 15 రోజులుగా డిప్యుటేషన్పై పనిచేస్తున్న తహసీల్దారు భార్గవిని తిరిగి తిరుపతి కలెక్టరేట్లోని డీ సెక్షన్ సూపరింటెండెంట్గా బదిలీ చేశారు. కాగా, ఈ బదిలీల వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. వసూల్ రాజాతోపాటు, సీఎం అభిప్రాయాలను తరచూ వెల్లడించే మరో ప్రతినిధికి కూడా ఏకంగా రూ.కోటి అందజేసినట్టు ఆ శాఖలోనే ప్రచారమవుతోంది. జిల్లా స్థాయిలో కూడా ఒకరిద్దరు అధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా వారికి రూ. 50 లక్షల దాకా ముట్టజెప్పినట్టు సమాచారం.
Updated Date - 2023-06-30T02:52:38+05:30 IST