ఎందుకి‘లా’?
ABN, First Publish Date - 2023-01-24T23:55:04+05:30
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది లా అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోనుంది. ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా పీజీ సెంటర్ ఉన్నప్పటి నుంచి.. ఈ క్యాంపస్లో లా కోర్సులు నిర్వహించేవారు. పీజీ సెంటర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిన తర్వాత 2010-11 విద్యా సంవత్సరం నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే కళాశాలగా ఏర్పాటుచేసి లా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు.
ఎందుకి‘లా’?
బీఆర్ఏయూలో ఈ ఏడాది లా అడ్మిషన్లకు బ్రేక్
బీసీఐ గుర్తింపు లేక పోవడంతో..
అనుమతించని ఉన్నత విద్యామండలి
విద్యార్థుల్లో ఆందోళన
(ఎచ్చెర్ల)
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది లా అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోనుంది. ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా పీజీ సెంటర్ ఉన్నప్పటి నుంచి.. ఈ క్యాంపస్లో లా కోర్సులు నిర్వహించేవారు. పీజీ సెంటర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిన తర్వాత 2010-11 విద్యా సంవత్సరం నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే కళాశాలగా ఏర్పాటుచేసి లా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నప్పుడు ఏయూకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) గుర్తింపుతో ఇక్కడి క్యాంపస్లో లా కోర్సులు నిర్వహించేవారు. అంబేడ్కర్ యూనివర్సిటీ ఏర్పాటైన తర్వాత లా కళాశాలకు బీసీఐ గుర్తింపు లభించలేదు. యూనివర్సిటీ ఏర్పాటు నుంచి బీసీఐ గుర్తింపునకు వర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నా ఫలించలేదు. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఏర్పాటైన తొలినాళ్లలో బీసీఐ గుర్తింపునకు ఓ కమిటీ వర్సిటీని సందర్శించింది. ఆ తర్వాత ప్రతి మూడేళ్ల కోసారి అఫిలియేషన్ కోసం, బీసీఐ కమిటీ సందర్శనకు అవసరమైన ఫీజులు చెల్లిస్తున్నా, కమిటీ సభ్యులు ఏనాడూ కూడా వర్సిటీని క్షేత్రస్థాయిలో సందర్శించలేదు. అయినప్పటికీ వర్సిటీలో లా కోర్సుల అడ్మిషన్లకు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. గతేడాది నవంబరు నెలలో బీసీఐ క మిటీ వర్సిటీ సందర్శన, గుర్తింపునకు వర్సిటీ అధికారులు రూ.8.5 లక్షలు చెల్లించారు. అయినప్పటికీ బీసీఐ కమిటీ సందర్శించలేదు సరికదా అడ్మిషన్ల కూడా అనుమతులు ఇవ్వలేదు. ఇదిలా ఉండగా 2022-23 విద్యా సంవత్సరంలో న్యాయ కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ నిర్వహించి, ఇప్పటికే రెండు సార్లు కౌన్సెలింగ్ కూడా నిర్వహించింది. మొదటి విడత కౌన్సెలింగ్లో వర్సిటీలో లా అడ్మిషన్లకు అనుమతించలేదు. రెండోసారి కౌన్సెలింగ్లోనైనా వర్సిటీలో అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలని బీసీఐ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులను కోరినా ఫలితం లభించలేదు. దీంతో వర్సిటీలో లా కోర్సులో చేరాలనుకున్న విద్యార్థులకు నిరాశే మిగిలింది. స్పాట్ అడ్మిషన్లతోనైనా సీట్లను భర్తీ చేస్తే కొంతవరకైనా ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీసీఐ గుర్తింపు లేకనే
బీసీఐ గుర్తింపు లేకపోవడం వల్లనే రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్సిటీలో లా కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వలేదు. బార్ కౌన్సిల్ గుర్తింపు ఉన్న కళాశాలల జాబితాను బీసీఐ ఏటా రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అందజేస్తుంది. ఈ జాబితా మేరకు ఉన్నత విద్యామండలిలో లా కళాశాలలో ప్రవేశాలకు అనుమతి ఇస్తుంది. వర్సిటీ ఏర్పడి 15 ఏళ్లు గడుస్తున్నా, బీసీఐ గుర్తింపు లేకపోయినా ఏనాడూ కూడా వర్సిటీలో లా కోర్సుల్లో ప్రవేశాలను నిలుపుదల చేయలేదు. ఈ ఏడాది మాత్రం బీసీఐ గుర్తింపు ఉన్న కళాశాలలకు మాత్రమే ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది.
ప్రయత్నలోపం లేదు
అంబేడ్కర్ యూనివర్సిటీలో లా కోర్సుల్లో ఈ ఏడాది అడ్మిషన్లకు చివరి వరకూ ప్రయత్నించాం. బీసీఐ నిబంధనల మేరకు ప్రతి మూడేళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నాం. అలాగే గతేడాది నవంబరులో 8.5 లక్షల రూపాయలను బీసీఐ గుర్తింపునకు, కమిటీ సందర్శన కోసం చెల్లించాం. అదే విధంగా బీసీఐ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం.
- ప్రొఫెసర్ సీహెచ్ ఏ రాజేంద్రప్రసాద్, రిజిస్ట్రార్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ
Updated Date - 2023-01-24T23:55:06+05:30 IST