అదే జోరు.. నిరసన హోరు
ABN, First Publish Date - 2023-09-22T23:52:42+05:30
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పది రోజులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
- చంద్రబాబుకు మద్దతుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/సరుబుజ్జిలి, సెప్టెంబరు 22)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పది రోజులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. చంద్రబాబుతో మేము సైతం అంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, వెంటనే ఆయనను విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోస్టుకార్డు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పలువురు టీడీపీ నాయకులను గృహ నిర్బంధించారు.
స్పీకర్ పదవిని దిగజార్చారు: టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్
‘రాష్ట్రంలో ఎంతోమంది రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉండి విలువలు పొందారు. కానీ తమ్మినేని సీతారాం మాత్రం.. స్పీకర్ పదవి స్థాయిని దిగజార్చారు’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా.. శుక్రవారం ఆమదాలవలసలో నియోజకవర్గ దళిత నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో సభ్యులందరికీ స్పీకర్ సమన్యాయం చేయాల్సి ఉండగా.. తమ్మినేని సీతారాం ఎన్నడూ ఆ సంప్రదాయం పాటించలేదని తెలిపారు. సభ ప్రారంభంలోనే ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి.. అధికారపార్టీ సభ్యులు చేసే సైకో భజన వినడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతోమంది దళిత నాయకులు, కార్యకర్తలను హతమార్చిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోనెల అప్పారావు, కాద అప్పలనాయుడు, తోట రాము, గుర్రాల చినబాబు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T23:52:42+05:30 IST