ప్రభుత్వ స్థలమా.. అయితే నాదే!
ABN, First Publish Date - 2023-06-26T23:41:24+05:30
ఆయన ఓ చోటా వైసీపీ నేత. సతీమణి గ్రామస్థాయి ప్రజాప్రతినిధి. ఇక తనకు అడ్డే లేదనుకున్నాడేమో! ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు.. దాన్ని కాజేసేదాకా నిద్రపోడు! గుట్టుచప్పుడు కాకుండా చదును చేస్తాడు.
రూ.కోట్ల విలువైన స్థలాలపై వైసీపీ నేత కన్ను
నరసన్నపేటలో పైడితల్లి ఆలయ సమీపాన ఆక్రమణ
రాత్రివేళ భవనాల శిథిలాలతో చదును
గతంలో కాలువ కప్పి.. నర్సరీకి పార్కింగ్ ఏర్పాటు
(నరసన్నపేట)
ఆయన ఓ చోటా వైసీపీ నేత. సతీమణి గ్రామస్థాయి ప్రజాప్రతినిధి. ఇక తనకు అడ్డే లేదనుకున్నాడేమో! ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు.. దాన్ని కాజేసేదాకా నిద్రపోడు! గుట్టుచప్పుడు కాకుండా చదును చేస్తాడు. అదును చూసి కబ్జా చేసేస్తాడు. ఈ యవ్వారంలో తన బంధువులనూ వాడుకుంటున్నాడు. వారి పేరిటా స్థలాలను మింగేస్తున్నాడు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తే.. అప్పటికప్పుడే చర్యలు. కొద్ది రోజులయ్యాక ఆ స్థలం ఆ చోటా నేత చెరలోకి వెళ్లిపోతుంది. తాజాగా ఆ వైసీపీ నేత నరసన్నపేటలో రూ.కోట్ల ప్రభుత్వ స్థలంలో రాత్రిరాత్రే మట్టి వేశాడు. ఆక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేశాడు. ఇప్పుడైనా అధికారుల చర్యలుంటాయో లేదో మరి!
.................
నరసన్నపేటలోని పైడితల్లి ఆలయానికి సమీపంలో.. అయ్యప్ప దేవాలయం పక్కన ఉన్న ప్రభుత్వ భూమిపై వైసీపీ చోటా నాయకుడి కన్ను పడింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ కార్మిక సంఘాల భవనాల నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రాంతంలో సుమారు 30 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. మార్కెట్ ధర ప్రకారం ఇక్కడ సెంటు రూ.20 లక్షలు పలుకుతోంది. రూ.6కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించేందుకు వైసీపీ నాయకుడు, ఓ ప్రజాప్రతినిధి భర్త ప్లాన్ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రివేళ భవనాల శిథిలాలు, మట్టితో ఖాళీ స్థలాన్ని చదును చేయడం ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. పంచాయతీ, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నా.. ఆ స్థలం తమ ఆధీనంలో ఉందని సంకేతం పంపేందుకు ముందు చదును చేసి.. ఆ తర్వాత ఆక్రమణకు యత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- జగన్నాథపురానికి చెందిన ఈ నాయకుడు గతంలో జాతీయ రహదారి పక్కనే డంపింగ్ యార్డుకు వెళ్లే మార్గంలో సుమారు 20 సెంట్లు కాలువను ఆక్రమించారు. అప్పట్లో అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణ చేసిన కాలువ అంతా కాకుండా పిల్ల బట్టిలా బయటకు తీశారు. ముందు భాగంలో తన నర్సరీకి పార్కింగ్ స్థలంగా వినియోగించుకుంటున్నారు.
- జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గతంలో తన బంధువులతో ఆక్రమణ చేసి.. భవనాల శిథిలాలతో కప్పించారు. రెవెన్యూ అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించినా.. ఆక్రమణలు పూర్తిగా తొలగించలేదు. కేవలం ట్రంచ్ కొట్టి జెండాలు ఏర్పాటు చేశారు. ఇలా పెద్దపేట, జగన్నాథపురం ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- తాజాగా అయ్యయ్పస్వామి ఆలయం పక్కన స్థలాన్ని కూడా ఇదే మాదిరి ఆక్రమణకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ, రెవెన్యూ అధికారులు స్పందించి ఈ స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
- దీనిపై ఫిర్యాదు అందిందని ఈవో సింహాద్రినాయుడు తెలిపారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. ఆక్రమణలు తొలగిస్తామన్నారు.
Updated Date - 2023-06-26T23:41:24+05:30 IST