నాలుగేళ్లుగా.. ‘నారాయణ’!
ABN, First Publish Date - 2023-02-07T00:03:54+05:30
నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్లు పూర్తయి నాలుగేళ్లు అవుతున్నా.. పనులు మాత్రం వేగవంతం కావడంలేదు. ఖరీఫ్ సీజన్ నాటికి కాలువ పనులు పూర్తిచేస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నా.. నిధుల సమస్య కారణంగా జాప్యమవుతోంది.
- నత్తనడకన ఆధునికీకరణ పనులు
- ఇప్పటివరకు 25 శాతమే పూర్తి
- వచ్చే ఖరీఫ్ నాటికైనా సాధ్యమయ్యేనా?
(ఎచ్చెర్ల)
నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్లు పూర్తయి నాలుగేళ్లు అవుతున్నా.. పనులు మాత్రం వేగవంతం కావడంలేదు. ఖరీఫ్ సీజన్ నాటికి కాలువ పనులు పూర్తిచేస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నా.. నిధుల సమస్య కారణంగా జాప్యమవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆనకట్ట ఆధునికీకరణకు రూ.112కోట్లు జైకా నిధులు మంజూరయ్యాయి. 2019లో ఆధునికీకరణ పనుల కోసం తొలిసారిగా ఒప్పందం కుదిరింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు సమీపించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి రెండు, మూడుసార్లు ఒప్పందం చేసుకున్నా.. పనులు పూర్తికాలేదు. కరోనా వ్యాప్తి కారణంగా కొంతకాలం, నిధుల సమస్యతో మరికొంత కాలంగా పనులు చేపట్టలేదు. ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తిచేసేందుకు గడువు పెంచింది. కానీ, గడువులోగా పనులు పూర్తిచేస్తారో? లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆనకట్టకు సంబంధించి సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల పరిధిలో సుమారు 50.5 ఎకరాల పొడవునా కుడి కాలువ ఉంది. ఇప్పటివరకు కుడి కాలువ కింద 25 శాతం పనులు మాత్రమే అయ్యాయి. గతేడాది ఖరీఫ్ ముందు సంతకవిటి మండలం వాల్తేరు నుంచి పొందూరు మండలం గోకర్ణపల్లి వరకు 3.2 కిలోమీటర్ల మేర కాలువ సిమెంటు లైనింగ్ పనులు చేశారు. ఒప్పందం ప్రకారం 36 కిలోమీటర్ల మేరకు సిమెంటు లైన్ జరగాల్సి ఉండగా, కేవలం 10శాతం మాత్రమే పూర్తయింది. పొందూరు మండలం తోలాపి నుంచి ఎచ్చెర్ల మండలంలో శివారు గ్రామమైన భగీరఽథపురం వరకు కాలువ ఎర్త్ వరకు చేయాల్సి ఉంది. రెండేళ్ల కిందట తోలాపి వరకు పూర్తిచేసిన ఎర్త్ వర్క్ ప్రస్తుతం అక్కడక్కడా పాడైంది.
పాడైన షట్టర్లు.. సింగిల్లైన్ బిడ్ర్జిలు
కుడి కాలువ పొడవునా చిన్నా, పెద్దా షట్టర్లు సుమారు 60 ఉన్నాయి. వీటిలో దాదాపుగా అన్ని షట్టర్లు పాడయ్యాయి. ఆనకట్ట ఏర్పాటు చేసిన కొత్తలో వీటిని అమర్చారు. తర్వాత షట్టర్లు మార్చిన దాఖలాలు లేవు. ఇవి పాడైపోవడంతో సాగునీరు వృథా అవుతోంది. అలాగే సింగిల్ లైన్బ్రిడ్జిలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాసుదేవపట్నం, సాలిపేట, మంతెన, మల్లయ్యపేట, బూరాడపేట, గోకర్ణపల్లి, దుప్పలవలస సమీపంలో సింగిల్ లైన్బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. ఎచ్చెర్ల మండలం మాలకుశాలపుర ం, పెయ్యలవానిపేట, పొందూరు మండలం కింతలి పరిధిలోని దోమగుండం చెరువు వద్ద పూర్తిగా పాడైన రెగ్యులేటర్స్ను మార్చాలి. దోమగుండం చెరువు వద్ద పాడైన మదుమును పునర్నిర్మించకపోతే నీరు వృఽథా అయ్యే అవకాశం ఉంది. కాలువ పొడవునా గట్టును పటిష్టం చేయాలి. మదుములు, షట్టర్లు బాగుచేస్తే తప్ప సాగునీటి కష్టాలు గట్టెక్కవు.
అన్నదాతలకు తప్పని కష్టాలు
నారాయణపురం కుడి కాలువ కింద శివారున ఎచ్చెర్ల మండలంలో కొత్తపేట, కొంగరాం, ముద్దాడ, ధర్మవరం, రామజోగిపేట, భగీరథపురం తదితర గ్రామాల ఆయకట్టుకు ఏటా అతికష్టమ్మీద సాగునీరు సరఫరా చేస్తున్నారు. ఏటా ఖరీఫ్లో మొక్కుబడిగా చేపడుతున్న పనుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండడంలేదు. దీంతో అన్నదాతలకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.
త్వరగా పూర్తిచేయాలి
టీడీపీ హయాంలో జైకా నిధులతో కొంతమేర నారాయణపురం ఆధునికీకరణ పనులను చేపట్టాం. నాలుగేళ్లయినా పనులు నత్తనడకగానే సాగుతున్నాయి. ఏటా ఖరీఫ్లో శివారు భూములకు సాగునీరు సక్రమంగా అందడంలేదు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఖరీఫ్ నాటికైనా ఆధునికీకరణ పనులను పూర్తి చేసి అన్నదాతలను ఆదుకోవాలి.
- బెండు మల్లేశ్వరరావు, మాజీ సర్పంచ్, ముద్దాడ
...................
వచ్చే ఖరీఫ్ నాటికి..
ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు కాలువ ద్వారా సాగునీరు అందించాం. ఆఽధునికీకరణ పనుల్లో భాగంగా పొందూరు మండలం కింతలి వద్ద ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించాం. వచ్చే ఖరీఫ్ నాటికి ఆధునికీకరణ పనులను సాధ్యమైనంత వరకు పూర్తి చేస్తాం.
- మురళీమోహన్, డీఈఈ, జలవనరుల శాఖ
Updated Date - 2023-02-07T00:03:56+05:30 IST