అమ్మా.. ఎందుకు చనిపోతున్నానో?
ABN, First Publish Date - 2023-09-28T00:16:42+05:30
పాతపట్నంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ‘అమ్మా నువ్వంటే నా కిష్టమే. తప్పడం లేదు. ఎందుకు చనిపోతున్నానో.. నాకే తెలియడం లేదు’ అంటూ తల్లికి లేఖ రాస్తూ.. బలవన్మరణానికి పాల్పడింది.
- నా కోసం బాధపడొద్దు
- నాన్న.. నువ్వు కలిసుండాలి
- నా అవయవాలు దానం చేయండి
- పాతపట్నంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- సూసైడ్ నోట్ రాసి.. బలవన్మరణం
పాతపట్నం సెప్టెంబరు 27: పాతపట్నంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ‘అమ్మా నువ్వంటే నా కిష్టమే. తప్పడం లేదు. ఎందుకు చనిపోతున్నానో.. నాకే తెలియడం లేదు’ అంటూ తల్లికి లేఖ రాస్తూ.. బలవన్మరణానికి పాల్పడింది. తనకోసం బాధపడొద్దని.. నాన్నా, నువ్వు కలిసుంటే చూడాలని.. చనిపోయాక తన అవయవాలు దానం చేయాలని లేఖలో పేర్కొంది. ముందురోజు కళాశాలలోని ఫ్రెషర్స్డేలో ఉత్సాహంగా పాల్గొని.. బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు తోటి విద్యార్థినులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. పాతపట్నంలోని జోగీశ్వరవీధికి చెందిన గుమ్మడి శ్రావణి అలియాస్ శ్యామల(16) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి పాతపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండేది. ఈమెకు తల్లిదండ్రులు శ్రీను, లక్ష్మి, అన్న నాని ఉన్నారు. తండ్రి శ్రీను రిక్షాబండి నడుపుతున్నా వచ్చే ఆదాయాన్ని మద్యానికే వెచ్చిస్తుంటాడు. తల్లి లక్ష్మి కొబ్బరిబోండాలు అమ్ముతూ కుటుంబాన్ని నడిపిస్తోంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో శ్రావణి మనస్తాపం చెందేది. శ్రావణి మంగళవారం సాయంత్రం కళాశాలలో జరిగే ఫ్రెషర్స్డేలో ఉత్సాహంగా పాల్గొంది. తోటి విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేసింది. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చి తల్లి లక్ష్మి ఎంతకొట్టినా తలుపులు తెరవలేదు. దీంతో వెనుక భాగం నుంచి తలుపులు బలవంతంగా తెరిచి లోపలకు వెళ్లి చూడగా.. శ్రావణి విగతజీవిగా కనిపించింది. దీంతో బోరున విలపించింది. స్థానికుల సహాయంతో ఆమెను సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ మహ్మద్ యాశిన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ శ్రావణి స్యూసైడ్ నోట్ లభ్యమైంది. ‘ఐలవ్యూ అమ్మా. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. కానీ తప్పదే. అమ్మా.. ఆరోజు గుడిలో ఆ పంతులు చెప్పింది నిజమే. ఎందుకు చస్తున్నానో కూడా తెలియడం లేదు. చచ్చిపోతున్నా. నాన్న నువ్వు కలిసిఉంటే చూడాలి అని నాకు ఒకే ఒక కోరిక. అది తీరకుండానే చచ్చిపోతున్నా. నా కోసం బాధపడకండి. రోజూ షాపు తియ్యమ్మా. నేను చచ్చిపోయాక నా కోసం డబ్బులు ఖర్చు పెట్టకండి. ప్లీజ్ నాన్నా.. దయచేసి తాగడం మానే. నేను ఎక్కడ ఉన్నా మీతోనే ఉంటా అమ్మా. నా చావుకు కారణం కూడా తెలియకుండానే చచ్చిపోతున్నా అమ్మా. నేను చచ్చిపోయాక నా అవయవాలన్నీ ఎవరికైనా దానం చెయ్యండి. మిస్యూ అమ్మా.. నాన్న.. అన్నయ్యా’ అని నోట్లో రాసి ఉంది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహ్మద్ యాశిన్ తెలిపారు.
Updated Date - 2023-09-28T00:16:42+05:30 IST