అద్దె పరికరాలకు ఆర్భాటం
ABN, First Publish Date - 2023-06-02T04:35:14+05:30
అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లు వ్యవసాయ యాంత్రీకరణను తీవ్రనిర్లక్ష్యం చేసిన జగన్ సర్కార్.. రైతుల నుంచి వచ్చిన డిమాండ్తో నిరుడు వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని చేపట్టింది.
● సన్నచిన్నకారు రైతులకు మేలు చేయని పనిముట్లు●
● గతంలో రాయితీపై వ్యక్తిగతంగా పంపిణీ
● రైతురథం పేరుతో 23,881 ట్రాక్టర్ల పంపిణీ
● ఇప్పుడు ఆర్బీకేలు, రైతు గ్రూపులకే అందజేత
● నేడు గుంటూరులో వైఎస్సార్ యంత్రసేవ మేళా
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లు వ్యవసాయ యాంత్రీకరణను తీవ్రనిర్లక్ష్యం చేసిన జగన్ సర్కార్.. రైతుల నుంచి వచ్చిన డిమాండ్తో నిరుడు వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని చేపట్టింది. శుక్రవారం గుంటూరులో సీఎంజగన్ రెండో యాంత్రీకరణ మేళాను ప్రారంభించనున్నారు. ఈ మేళాలో రూ.125.48 కోట్ల సబ్సిడీతో రూ.361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు రైతులకు వ్యక్తిగతంగా రాయితీ పరికరాలు సరఫరా చేసింది. దీనికి భిన్నంగా జగన్ సర్కారు రైతు గ్రూపులకు మాత్రమే వీటిని అందిస్తోంది. వాటిని అద్దె ప్రాతిపదికన రైతులకు ఇస్తున్నారు. పైగా రైతు గ్రూపులు ముందుగా 10% డబ్బులు కడితే, 40% రాయితీ, 50% రుణం అని చెప్పి.. రాయితీ సొమ్మును తర్వాత చెల్లిస్తోంది. దీంతో వ్యవసాయ పరికరాలకు రైతు గ్రూపులు అద్దెలు భారీగా వసూలు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పథకంతో రైతులకు పెద్దగా మేలు జరగడంలేదన్న వాదన వినిపిస్తోంది. అయినా జగన్ ప్రభుత్వం వ్యక్తిగత పరికరాల పంపిణీపై దృష్టి పెట్టడం లేదు. నిజానికి గత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేయగా, ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్ల తర్వాత హడావుడి చేస్తోంది.
2017–18లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతురథం పథకం తెచ్చింది. పెద్ద ట్రాక్టర్లు, రోటోవేటర్లను ఈ పథకం కింద పంపిణీ చేశారు. రూ.2.5లక్షల రాయితీతో 12,217 ట్రాక్టర్లు మంజూరు చేశారు. 2018–19లో రూ.2లక్షల రాయితీతో 11,664 ట్రాక్టర్లు సరఫరా చేశారు. మొత్తం టీడీపీ హయాంలో ఈ పథకం కింద దాదాపు 23వేల ట్రాక్టర్లు సరఫరా చేశారు. వైసీపీ గత ఏడాది 3,800 ట్రాక్టర్లు రైతు గ్రూపులకు ఇచ్చింది. ఇప్పుడు 2,562 ట్రాక్టర్లు మాత్రమే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. గత ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ రైతులకు 50నుంచి70 శాతానికి రాయితీని పెంచి, టార్పాలిన్లు, పవర్ స్పేయర్లు వంటి అనేక వ్యవసాయ పనిముట్లను అందించారు. అధిక విలువ ఉన్న యంత్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా అందుబాటులో ఉంచింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్బీకేలు, క్లస్టర్ స్థాయి యంత్రసేవా కేంద్రాలకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ఇతర పరికరాలన్నింటికీ కలిపి రూ.1,052కోట్లు మాత్రమే వెచ్చించింది. ప్రభుత్వం టార్పాలిన్ పట్టాల పంపిణీపై ఇప్పటికీ శ్రద్ధ తీసుకున్న దాఖలా లేదు. వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని తెస్తామని చెప్పి.. నాలుగేళ్లు గడిచినా ప్రవేశపెట్టలేదు. స్ప్రేయర్లు, టార్పాలిన్లు 50శాతం రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటామంటూ ఎన్నికల ఏడాదిలో ప్రకటనలు గుప్పిస్తున్నారు.
Updated Date - 2023-06-02T04:35:14+05:30 IST