టీచర్లకు జీతాలు దండగ!
ABN, First Publish Date - 2023-01-29T02:48:07+05:30
జనవరి వచ్చినా ఆగస్టు వరకు మాత్రమే పాఠ్యాంశాలు బోధించినట్టు పుస్తకాల్లో రాసి ఉంది.
నేనే యూట్యూబ్లో పాఠాలు చెబుతా
ప్రభుత్వానికి రూ.కోట్లు మిగులుతాయి
ఉపాధ్యాయులు పాఠశాలల్లో నిద్రపోతుంటారు
టీచర్లు, ఉన్నతాధికారులపై ప్రవీణ్ ప్రకాశ్ ఫైర్
క్రికెట్ చూస్తుంటారని తీవ్ర వ్యాఖ్యలు
ఆకివీడు, జనవరి 28: ‘జనవరి వచ్చినా ఆగస్టు వరకు మాత్రమే పాఠ్యాంశాలు బోధించినట్టు పుస్తకాల్లో రాసి ఉంది. మీరేం చేస్తున్నారు?’ అంటూ జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులపై పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శివాలయం, ఈస్ట్ పాలెం ఎంపీపీ పాఠశాలల్లో విద్యార్థుల పుస్తకాలు, నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజనాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టీచర్లు, ఉన్నతాధికారులపై ఫైర్ అయ్యారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొదటి పీరియడ్ చెప్పిన తర్వాత నిద్రపోతుంటారు. క్రికెట్ చూస్తుంటారు. ఇక్కడ బోధన సక్రమంగా లేకే ప్రైవేటు బడులు పుష్కలంగా నడుస్తున్నాయి’ అని ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ జీతాలెంత అని ఆర్జేడీ మధుసూదనరావు, డీఈవో వెంకటరమణ, డీవైఈవో శ్యామ్సుందర్, ఎంఈవో రవీంద్రలను ప్రశ్నించారు. ‘‘ రూ.కోట్లల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ మాత్రం బోధనకు రూ.కోట్లు చెల్లించడం దండగ. యూట్యూబ్ ద్వారా నేనే చెబితే ప్రభుత్వానికి రూ.కోట్లు మిగులుతాయి. నాడు-నేడుకు ఆగస్టులో నిధులు మంజూరైనా జనవరి నాటికి పనులు ఎందుకు పూర్తి చేయలేదు. ఎందుకు సస్పెండ్ చేయకూడదు?’ అని మండిపడ్డారు.
Updated Date - 2023-01-29T02:48:07+05:30 IST