వెలిగొండ ప్రాజెక్ట్ సాధనే లక్ష్యం
ABN, First Publish Date - 2023-04-03T23:52:53+05:30
: వెలిగొండ ప్రాజెక్ట్ను సాధించి తాగు, సాగునీరు అందించి పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీర్చడమే లక్ష్యంగా ప్రజా చైతన్య పాదయాత్ర చేస్తున్నట్లు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు.
తర్లుపాడు, ఏప్రిల్ 3: వెలిగొండ ప్రాజెక్ట్ను సాధించి తాగు, సాగునీరు అందించి పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీర్చడమే లక్ష్యంగా ప్రజా చైతన్య పాదయాత్ర చేస్తున్నట్లు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మంగళకుంట నుంచి ప్రారంభమైన ప్రజాచైతన్య పాదయాత్ర 9వ రోజు కొత్తూరు, తాడివారిపల్లి, నాగెళ్లముడుపు వరకు సాగింది. పాదయాత్రలో భాగంగా రోడ్డు వెంబడి పనులు చేస్తున్న కూలీలను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ.. పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడమే మార్గమన్నారు. గతంలో టీడీపీ హయాంలో వెలిగొండ పనులు శరవేగంగా సాగాయన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుపై నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే రూ.3200 కోట్లు అవసరం కాగా.., ప్రస్తుత బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయాలని గతంలో ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురాన్ని జిల్లాగా చేయిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే చంద్రబాబు వెలిగొండ పూర్తి చేస్తాన్నరన్నారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, మాజీ ఎంపీపీ పులివేముల ఏసుదాసు, క్లస్టర్ ఇన్చార్జ్ కుందురు కాశిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు కంచెర్ల కాశయ్య, ఆర్.గురవయ్య, నారాయణరెడ్డి, తాడి చలమారెడ్డి, పెద్దిరాజు, కందుల చిట్టిబాబు, బుడ్డడయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-03T23:52:53+05:30 IST