మహిళా కార్యదర్శిపై కక్ష సాధింపు
ABN, First Publish Date - 2023-02-07T03:58:38+05:30
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురం సచివాలయ కార్యదర్శి సమీహ అహ్మద్పై వైసీపీ నేతల కక్షసాధింపు చర్యలు తారస్థాయికి చేరాయి.
వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజు అనుచరుల బరితెగింపు
3 గంటలపాటు సచివాలయ ఉద్యోగుల నిర్బంధం
అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో ఘటన
మునగపాక (అనకాపల్లి జిల్లా), ఫిబ్రవరి 6: అనకాపల్లి జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురం సచివాలయ కార్యదర్శి సమీహ అహ్మద్పై వైసీపీ నేతల కక్షసాధింపు చర్యలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఆమె సచివాలయంలో విధుల్లో ఉండగా, వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు సచివాలయ భవనానికి తాళం వేసి మూడు గంటలపాటు నిర్బంధించారు. ‘‘నిన్ను సస్పెండ్ చేశారుగా.. ఎందుకొచ్చావు?, మా ఎమ్మెల్యేనే తిడతావా! ఎంత ధైర్యం?...నిన్ను మెడపట్టి బయటకు తోసేయమని మా ఎమ్మెల్యే చెప్పారు. మర్యాదగా కార్యాలయంలో నుంచి వెళ్లిపో. లేకపోతే సచివాలయానికి తాళం వేసేస్తా’... అంటూ అధికార వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు కర్రి సంజీవమ్మ కార్యదర్శి సమీహను హెచ్చరించారు. వివరాలివీ.. సంక్రాంతి పండుగ సమయంలో పల్లపు ఆనందపురంలో వైసీపీ నాయకులు, ఎలమంచిలి ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు (కన్నబాబురాజు), ఆయన కుమారుడు సుకుమారవర్మ ఫొటోలతో కార్యకర్తలు గ్రామ సచివాలయానికి సమీపంలో ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. అనుమతి లేకుండా ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీని తొలగించాలని సిబ్బందిని ఆదేశించినా.. అధికార పార్టీ నేతల ఫ్లెక్సీ కావడంతో వారు కూడా వెనుకంజ వేశారు. దీంతో కార్యదర్శి సమీహ స్వయంగా ఫ్లెక్సీని తొలగించారు. దీంతో వైసీపీ నాయకుల అహం దెబ్బతిన్నది. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో ఆయన మరుసటి రోజు గ్రామ కార్యదర్శికి ఫోన్ చేసి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సమీహ శనివారం విధులకు హాజరుకారని స్థానిక వైసీపీ నాయకులు భావించారు. కానీ ఆమె సచివాలయానికి వచ్చి విధులు నిర్వర్తిస్తుండడంతో...ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సోమవారం కూడా సమీహ యథావిధిగా విధులకు హాజరు కావడంతో వైసీపీ నాయకులు తట్టుకోలేకపోయారు. ఎంపీటీసీ సభ్యురాలు సంజీవమ్మ, మరికొంతమంది నాయకులు కలిసి మధ్యాహ్నం సచివాలయానికి వచ్చారు. సంజీవమ్మ కార్యాలయంలోకి వెళ్లి, బయటకు వెళ్లిపోవాలని కార్యదర్శిని ఆదేశించారు. తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని కార్యదర్శి స్పష్టంచేయగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మూడు గంటల సమయంలో సంజీవమ్మ బయటకు వచ్చి మెయిన్ గేటు (గ్రిల్స్)కు తాళం వేశారు. ఆ సమయానికి లోపల పంచాయతీ కార్యదర్శి సమీహతో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, అగ్రికల్చరల్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వివిధ పనుల మీద వచ్చిన నలుగురు గ్రామస్థులు ఉన్నారు. సుమారు మూడు గంటల తరువాత పోలీసులు వస్తున్నట్టు తెలియడంతో ఆమె తాళాలు తీశారు.
Updated Date - 2023-02-07T03:58:39+05:30 IST