నేటి నుంచి శ్రీశైలంలో ఆన్లైన్ టికెట్
ABN, First Publish Date - 2023-05-01T03:43:01+05:30
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి స్వామి, అమ్మవార్ల ఆర్జిత సేవలు, స్వామివారి స్పర్శ దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్ పొందిన భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.
గుర్తింపుకార్డు తప్పనిసరి
శ్రీశైలం, ఏప్రిల్ 30: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి స్వామి, అమ్మవార్ల ఆర్జిత సేవలు, స్వామివారి స్పర్శ దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్ పొందిన భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. గత నెల 25న మే నెల ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను దేవస్థానం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం.ఓఆర్జీలో అందుబాటులో ఉంచారు. అయితే భక్తులు స్వామి అలంకరణ శీఘ్రదర్శనం రూ.150, అతిశీఘ్రదర్శనం రూ.300 టికెట్లను ఆన్లైన్తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా పొందవచ్చు. ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు తమ సేవా సమయంలో 15 నిమిషాల ముందు రిపోర్టు చేయాలని, వారి ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. కాగా.. క్షేత్రానికి వచ్చే ప్రముఖులు వారి పర్యటన వివరాలను కనీసం రెండు రోజుల ముందే తెలియజేయాలని ఆలయ అధికారులు తెలిపారు.
Updated Date - 2023-05-01T03:43:40+05:30 IST