జీవో 1తో ఎవ్వరికీ ఇబ్బందులు ఉండవు
ABN, First Publish Date - 2023-01-29T02:41:22+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎటువంటి అడ్డంకి లేదు. ఏ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారో ఆ జిల్లా ఎస్పీ అనుమతి తీసుకొని పాదయాత్ర చేసుకోవచ్చు
కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారు
యువగళం యాత్రకు అడ్డంకి లేదు
జిల్లా ఎస్పీల అనుమతితో చేసుకోవచ్చు
6 నెలల్లో 40 దిశ కేసుల్లో నిందితులకు శిక్ష: డీజీపీ కసిరెడ్డి
భీమవరం క్రైం, జనవరి 28: ‘‘టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎటువంటి అడ్డంకి లేదు. ఏ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారో ఆ జిల్లా ఎస్పీ అనుమతి తీసుకొని పాదయాత్ర చేసుకోవచ్చు’’ అని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీవిష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో శనివారం ఆయన జిల్లా పోలీసులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘జీవో-1 వల్ల ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొంతమంది కావాలనే జీవోపై విష ప్రచారం చేస్తున్నారు. జీవో వచ్చిన తర్వాత కూడా రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతులు ఇచ్చాం. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో 40 దిశ కేసుల్లో నిందితులకు శిక్ష పడింది. రాష్ట్రంలో గతేడాది 7,500 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వసం చేశాం. ఈ ఏడాది 600 ఎకరాల్లో పంటను గుర్తించాం. దానిని త్వరలో ధ్వంసం చేస్తాం. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లపై ఆయా జిల్లాల ఎస్పీలు ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల మహిళలపై దాడులు తగ్గాయి. పోలీసులపై ప్రజల విశ్వాసం, పోలీసుల సమర్థత, నిజాయితీ తదితర అంశాల్లో కేంద్ర సర్వేలో దేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది’’ అని డీజీపీ అన్నారు. సమావేశంలో డీఐజీ పాలరాజు, జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ఉన్నారు.
Updated Date - 2023-01-29T02:41:22+05:30 IST