పులకించిన స్వర్ణాల పరవశించిన భక్తజనం
ABN, First Publish Date - 2023-08-02T00:19:10+05:30
కులం లేదు.. మతం లేదు... అందరూ ఒక్కటే.. అందరివీ కోరికలే. నెరవేరిన కోరికలు తలచుకుంటూ కొందరు.. కొత్త కోరికలు కోరుకుంటూ మరికొందరు ఇలా వరాల రొట్టె కోసం తరలిరావడంతో ‘స్వర్ణాల’ తీరం భక్తజనసంద్రంగా మారింది.
ఇప్పటిదాకా 8 లక్షల మందికిపైగా రాక
నేటితో ముగియనున్న పండుగ సంబరం
కులం లేదు.. మతం లేదు... అందరూ ఒక్కటే.. అందరివీ కోరికలే. నెరవేరిన కోరికలు తలచుకుంటూ కొందరు.. కొత్త కోరికలు కోరుకుంటూ మరికొందరు ఇలా వరాల రొట్టె కోసం తరలిరావడంతో ‘స్వర్ణాల’ తీరం భక్తజనసంద్రంగా మారింది. పండుగలో నాల్గవ రోజు కూడా భక్తులు తరలిరావడంతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిటకిటలాడింది.
నెల్లూరు (సాంస్కృతికం), ఆగస్టు 1 :
నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో నాల్గవ రోజు మంగళవారం తహలీల్ఫాతేహా భక్తిశ్రద్ధలతో జరిగింది. ముస్లిం మతపెద్దలు బారాషహీద్లకు వక్ఫ్బోర్డు అధికారులతో కలిసి సంప్రదాయ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు గంథం పంచారు. పండుగలో ఇప్పటిదాకా సుమారు ఎనిమిది లక్షల మందికిపైగా యాత్రికులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చిన వారికి ఎలాంటి లోటు తలెత్తకుండా కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. దర్గాలో గడిచిన రోజులుగా పారిశుధ్య సిబ్బంది మైదానాన్ని శుభ్రపరుస్తూ పారిశుధ్యాన్ని మెరుగు పరుస్తున్నారు. దాదాపు 4800 సిబ్బంది వంతులవారీగా నిత్యం దర్గాలోనే ఉంటూ భక్తులకు సేవలందిస్తున్నారు. అలాగే జేసీ కూర్మనాథ్, ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ ఇతర శాఖల అధికారులు దర్గా ప్రాంగణంలోనే ఉంటూ అధికార సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. కాగా, చెరువులో భక్తులు బోటు షికారు చేసి ఖుషీ అయ్యారు. దీనివల్ల పర్యాటకాభివృద్ధి సంస్థకు దాదాపు రూ.5.5 లక్షలు ఆదాయం లభించింది.
నేడు ముగింపు కార్యక్రమం
గత నెల 29వ తేదీన ప్రారంభమైన రొట్టెల పండుగ బుధవారం ముగియనుంది. పండుగ రోజుల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ఉదయం జరిగే ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ఎం.హరినారాయణన్ సన్మానాలు, జ్ఞాపికలు అందజేస్తారు.
24 కేజీల భారీ రొట్టె
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి 24 కిలోల భారీ రొట్టెను అందుకున్నారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బారాషహీద్ దర్గాకు వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. బారాషహీద్ ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ హయత్బాషా ఆధ్వర్యంలో మైనారిటీ నాయకులు తయారు చేయించిన 24 కోరికల 24 కేజీల భారీ రొట్టెను దర్గా నుంచి స్వర్ణాల చెరువు ఘాట్ వద్దకు ప్రదర్శనగా తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఆ రొట్టెను అందుకుని భక్తులకు పంచి పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024లో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని, రూరల్ ఎమ్మెల్యేగా తాను హ్యాట్రిక్ సాధించాలని, దేశం సుభిక్షంగా ఉండాలని అనే కోర్కెలు కూడా ఉన్నాయన్నారు.
============
ఫొటోవార్త
4 కరుణానిధి 1 : డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డికి ప్రశంసాపత్రం ఇస్తున్న కలెక్టర్
‘జగనన్న సురక్ష’లో మనమే టాప్!
5.77 లక్షల సేవలకు పరిష్కారం
సేవల్లోనూ రెండవ స్థానం
కలెక్టర్ హరినారాయణన్ వెల్లడి
నెల్లూరు (హరనాథపురం), ఆగస్టు 1 : జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ధ్రువీకరణ పత్రాల జారీలో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానం, సేవలందించడంలో రెండవ స్థానం సాధించినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నవరత్నాల కార్యక్రమం కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందించాలన్న లక్ష్యంతో జూన్ 24 నుంచి జూలై 31 వరకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 769 సచివాలయాలు, 13,744 క్లస్టర్ల పరిధిలోని వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవసరమైన 5,85,323 సర్వీసులను నమోదు చేసుకొని, 5,77,374 సర్వీసులను పరిష్కరించినట్లు తెలిపారు. సరైన ఆధారాలు లేనందున 6415 సర్వీసులను తిరస్కరించగా, మిగిలిన 1535 సర్వీసులు పరిష్కార దశలో ఉన్నాయని చెప్పారు. సర్వీసుల పరిష్కారంలో 98.78 శాతం మేర లక్ష్యం సాధించినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని మొత్తం 8,37,465 కుటంబాలు ఉండగా, జగనన్న సురక్షలో 7,31,108 కుటుంబాలను కవర్ చేసినట్లు చెప్పారు. ఉచిత సేవల వల్ల సుమారు రూ.2.97 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని ప్రజలకు కల్పించినట్లు తెలిపారు. ఇక జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుంచి ఈకేవైసీ కోసం 4942 అర్జీలు రాగా, వాటిలో 4322 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేసిన డీఆర్డీఏ పీడీ కేవీ సాంబశివారెడ్డి, జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించిన జడ్పీ సీఈఓ చిరంజీవీనికి కలెక్టర్ ప్రశంసాపత్రాలు ఇచ్చి అభినందించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, కార్పొరేషన్ కమిషనర్ వికా్సమర్మత్ తదితరులు పాల్గొన్నారు.
==================
Updated Date - 2023-08-02T00:19:10+05:30 IST