ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
ABN, First Publish Date - 2023-03-16T21:19:06+05:30
మండలంలోని ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని గురువారం రైతులు తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. మద్ధ
సంగం, మార్చి 16: మండలంలోని ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని గురువారం రైతులు తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. మద్ధతుధరకు ధాన్యం కొనుగోలు చేయాలి... అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఏడు ఆర్బీకేల్లో మార్చి 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటి కూడా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు మసూరి ధాన్యం ధరలు పుట్టి రూ. 14 వేలకు పడిపోయాయన్నారు. అంతేకాక కల్లాలు అందుబాటులో లేకుండా ధాన్యం ఆరబెట్టాలని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. లేకుంటే గత ఏడాది మాదిరిగానే నూర్పిడి చేసిన ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకొచ్చి తహసీల్దారు కార్యాలయం ఎదుట రాశి పోసి ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. ఆ మేరకు రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
---------------
Updated Date - 2023-03-16T21:19:06+05:30 IST