‘నీట్’కు 17ఏళ్లు నిండి ఉండాల్సిందే
ABN, First Publish Date - 2023-03-26T04:02:55+05:30
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రాసే అభ్యర్థులకు ‘ప్రవేశంపొందిన ఏడాది డిసెంబరు 31’ నాటికి కనీసం 17ఏళ్లు నిండి ఉండాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
దీనిపై ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు స్పష్టత ఇచ్చింది
ఇందులో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం... వ్యాజ్యం కొట్టివేత
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రాసే అభ్యర్థులకు ‘ప్రవేశంపొందిన ఏడాది డిసెంబరు 31’ నాటికి కనీసం 17ఏళ్లు నిండి ఉండాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టు స్పష్టత ఇచ్చిందని, కనీస వయసును 17ఏళ్లుగా నిర్ణయించడం సమానత్వ హక్కును నిరాకరించినట్లు కాదని పేర్కొందని గుర్తు చేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. నీట్ రాసే అభ్యర్థులకు ‘అడ్మిషన్ పొందే ఏడాది డిసెంబరు 31’ నాటికి కనీసం 17ఏళ్లు నిండి ఉండాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ విధించిన నిబంధనను సవాల్ చేస్తూ కడపకు చెందిన బాలిక(16) హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... బాలిక వయసు 4రోజులు మాత్రమే తగ్గుతోందని, నీట్ రాసేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. మెడికల్ కౌన్సిల్ విధించిన నిబంధన రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును ఉల్లంఘించేదిగా ఉందన్నారు. ఎన్ఎంసీ తరఫున న్యాయవాది వివేక్ చంద్రశేఖర్, కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదనలు వినిపిస్తూ... ఇప్పటికే ఈ వ్యవహారంలో ఉమ్మడి హైకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందన్నారు. వివరాలను కోర్టు ముందు ఉంచారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ఎన్ని రోజులు తగ్గాయనేది అప్రస్తుతమని వ్యాఖ్యానించింది.
Updated Date - 2023-03-26T04:02:55+05:30 IST