Lokesh met Amit Shah : అమిత్ షాతో లోకేశ్ భేటీ
ABN, First Publish Date - 2023-10-12T03:31:59+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు.
కేంద్ర హోంమంత్రి దృష్టికి జగన్ కక్ష సాధింపులు
ఏపీలో పరాకాష్ఠకు ఆటవిక పరిస్థితులు
బాబును అరెస్టు చేసిన తీరు, వరుస కేసులు, వేధింపులపై వివరణ
తల్లినీ, భార్యనూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన
లోకేశ్ చెప్పింది ఆసాంతం విన్న అమిత్షా
చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆరా
73 ఏళ్ల వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని వెల్లడి
న్యూఢిల్లీ/అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. తన తండ్రితోపాటు మొత్తం కుటుంబ సభ్యులను తప్పుడు కేసులతో వేధిస్తున్న వైనాన్ని వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుపై రెండు రోజుల సీఐడీ విచారణ ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం లోకేశ్ ఢిల్లీకి వెళ్లారు. రాత్రి పొద్దుపోయాక అమిత్షాతో ఆయన నివాసంలో సుమారు అరగంటపాటు సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, లోకేశ్ పెద్దమ్మ పురందేశ్వరితోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అమిత్షాకు లోకేశ్ క్షుణ్నంగా వివరించారు. స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టులో అక్రమ కేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, ఆయన జైలు నుంచి బయటికి రాకుండా చూసేందుకు వరుసగా వేర్వేరు కేసులు పెట్టడం, తనను విచారణ పేరిట ఇబ్బంది పెట్టడం గురించి వివరించారు. చివరికి... తన తల్లినీ, భార్యనూ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా తాము చేస్తున్న న్యాయ పోరాటం, అక్కడ కేసుల పరిస్థితి గురించి కూడా తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్రంలో ఆటవిక పరిస్థితి నెలకొందని, ఇప్పుడది పరాకాష్ఠకు చేరిందని చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజల ప్రతిస్పందనను వివరించి... దీనిని మీరూ గమనించే ఉంటారని అమిత్షాతో అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీరికలేకుండా ఉన్నప్పటికీ, రాత్రి పొద్దుపోయినా లోకేశ్ చెప్పిన వివరాలను అమిత్షా శ్రద్ధగా విన్నారు. చంద్రబాబుపైనా, లోకేశ్పైనా ఎన్ని కేసులు పెట్టారో అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 73ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తామూ గమనిస్తున్నామని చెప్పారు.
పురందేశ్వరి ట్వీట్: అమిత్షాతో లోకేశ్ భేటీపై పురందేశ్వరి ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు గురించి అమిత్షాకు లోకేశ్ వివరంగా చెప్పారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనే వాళ్లు ఇప్పుడు చెప్పండి! మీరంటున్నది నిజమైతే లోకేశ్కు అమిత్షా అపాయింట్మెంట్ ఇస్తారా?’’ అని ప్రశ్నించారు.
Updated Date - 2023-10-12T03:31:59+05:30 IST