ముస్లింలకు కానుకగా షాదీఖానా: బీసీ
ABN, First Publish Date - 2023-06-26T00:31:21+05:30
బనగానపల్లె పట్టణంలో గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన షాదీఖానాను సొంత నిధులతో నిర్మించి ముస్లిం, మైనార్టీలకు కానుకగా సమర్పిస్తానని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి తెలిపారు.
బనగానపల్లె, జూన్ 25: బనగానపల్లె పట్టణంలో గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన షాదీఖానాను సొంత నిధులతో నిర్మించి ముస్లిం, మైనార్టీలకు కానుకగా సమర్పిస్తానని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి తెలిపారు. ఆదివారం బనగానపల్లె పట్టణంలోని షాదీఖానా నిర్మాణం పనులను ఆయన పునఃప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షాదీఖానా నిర్మాణం కోసం రూ.30 లక్షలు వక్ఫ్బోర్డుకు విరాళంగా ఎంపీడీవో ద్వారా అప్పట్లో అందించామన్నారు. వక్ఫ్బోర్డు కోటి రూపాయలు నిధులు మంజూరు చేసిందన్నారు. మొత్తం 1.3 కోట్లతో అప్పట్లో 2019 ఫిబ్రవరి 4వ తేదీన షాదీఖానా నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. షాదీఖానా కమిటీ ఆధ్వర్యంలో అప్పట్లో 4 నెలల కాలంలోనే రూ.55 లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణం పనులు పూర్తి చేశామన్నారు. ఇందులో రూ.30లక్షలు మాత్రమే తమకు బిల్లుల రూపంలో వచ్చిందన్నారు. ఇంకా రూ.25 లక్షలు బిల్లులు రావాల్సి ఉందన్నారు. 2009 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో షాదీఖానా పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వం రావడంతో రివర్స్ టెండరింగ్ విధానం వల్ల షాదీఖానా నిర్మాణం పనులు ఆగిపోయాయన్నారు. తాను షాదీఖానా నిర్మించాలనుకున్నా ఎక్కడ తనకు పేరు వస్తుందోనని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పనులు జరుగకుండా అడ్డుపడ్డారన్నారు. అన్వర్ హుస్సేన్, పట్టణ ఉప సర్పంచ్ బురానుద్దీన్, రాయలసీమ సలాం, పూలకలాం, అల్తాఫ్ హుస్సేన్, ఖైరత్ఆలీ, అమీర్జాన్, అహ్మద్హుస్సేన్, గౌండాబాబు, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T00:31:21+05:30 IST