సిద్ధార్థరెడ్డిపై దళిత సంఘాల ఆగ్రహం
ABN, First Publish Date - 2023-09-04T00:18:38+05:30
నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్ను దళితుడనే కారణంతో కనీసం ఫ్రోటోకాల్ పాటించకుండా అడ్డుతగులుతున్నారంటూ వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై దళిత గిరిజన సంఘాలు భగ్గుమన్నాయి.
ఆర్థర్కు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే ఫ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
నంద్యాల టౌన్, సెప్టెంబరు 3 : నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్ను దళితుడనే కారణంతో కనీసం ఫ్రోటోకాల్ పాటించకుండా అడ్డుతగులుతున్నారంటూ వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై దళిత గిరిజన సంఘాలు భగ్గుమన్నాయి. ఆదివారం నంద్యాలలో దళిత ఐక్యకార్యాచరణ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లింగస్వామి అధ్యక్షతన గిరిజన ప్రజాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ ఆధ్వర్యంలో దళిత, గిరిజన, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కేవలం దళిత ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో పార్టీ ఇన్చార్జీలుగా అగ్రవర్ణాల వారిని వైసీపీ అధిష్టానం నియమించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లో 14 నియోజకవర్గాలకు గాను దళిత ఎమ్మెల్యే స్థానాలు పోను మిగతా నియోజకవర్గాల్లో కూడా చేతనైతే స్థానిక ఎమ్మెల్యేలకు కాదని ఇతరులకు పార్టీ ఇన్చార్జీలుగా నియమించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలుపొందిన వారిలో తొగూరు ఆర్థర్కు కనీసం గౌరవం ఇవ్వకుండా అధికారిక ప్రారంభోత్సవాలకు పిలువ కుండా, వైసీపీలోని అగ్రవర్ణాలతో కలిసి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యవహరిస్తున్న అహంకార పూరిత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అగ్రవర్ణాలు ఎమ్మెల్యేలుగా ఉన్న స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ నాయకులకు పార్టీ ఇన్చార్జీలుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పెత్తందారి వ్యవస్థ రోజు రోజుకు పెరిగిపోతున్నదని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని కలంకమని పేర్కొన్నారు. తొగూరు ఆర్థర్కు బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు ప్రమాణ స్వీకారాలు, ప్రారంభోత్సవాలకు వెళ్లిన వైసీపీ అగ్రవర్ణ ప్రజాప్రతినిధులు బేషరతుగా బహిరంగ క్షేమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దళిత, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-04T00:18:38+05:30 IST