బైర్లూటిలో హాస్టల్ను పునఃప్రారంభించాలి
ABN, First Publish Date - 2023-09-21T23:40:51+05:30
మండలంలోని బైర్లూటిలో గిరిజన బాలుర వసతిగృహాన్ని పునఃప్రారంభించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోషియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు.
ఆత్మకూరు, సెప్టెంబరు 21: మండలంలోని బైర్లూటిలో గిరిజన బాలుర వసతిగృహాన్ని పునఃప్రారంభించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోషియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 2013 వరకు బైర్లూటిలో గిరిజన బాలుర వసతిగృహం ఉండేదని, 120 నుంచి150 మంది విద్యార్థులు హాస్టల్లో విద్యనభ్యసించేవారని తెలిపారు. ఇక్కడ ఉన్న బాలుర వసతి గృహాన్ని ఎత్తివేసి ఆ స్థానంలో బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీనివల్ల పెచ్చెర్వు, రుద్రకోడూరు, అమలాపురం, ఇందిరేశ్వరం, నాగలూటి వంటి నల్లమల చెంచుగూడేల గిరిజన విద్యార్థులు విద్యకు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వక్తం చేశారు. ఈ కారణంగానే ప్రస్తుతం బైర్లూటిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 53 మంది విద్యార్థులు ఉన్నారని, భవిష్యత్లో ఈ సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకుని బైర్లూటిలో బాలుర వసతి గృహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు రాజేష్, మల్లీ, పవన్, అజయ్, సునీల్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-09-21T23:40:51+05:30 IST