టార్గెట్.. తాళం ఇళ్లే..
ABN, First Publish Date - 2023-06-11T00:37:11+05:30
విద్యాధరపురానికి చెందిన కుటుంబం చిట్టినగర్లో వస్త్రవ్యాపారం చేస్తోంది. కుమార్తెకు అనారోగ్యంగా ఉండటంతో ఈనెల ఐదున అంత హైదరాబాద్కు వెళ్లారు. తొమ్మిదో తేదీన వచ్చి చూసుకునే సరికి ఇంటి మొదటి అంతస్తు తాళాలు పగలుగొట్టి ఉన్నాయి. ఇంట్లో కవర్లో పెట్టిన బంగారు ఆభరణాలు కనిపించకుండాపోయాయి. భవానీపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఇది.
నగరంలో చెలరేగిపోతున్న దొంగలు
కొద్దిరోజులుగా వరుస చోరీలు
ఒక కేసును చేధించిన పోలీసులు
పాత నేరగాళ్లపైనే అనుమానాలు
విద్యాధరపురానికి చెందిన కుటుంబం చిట్టినగర్లో వస్త్రవ్యాపారం చేస్తోంది. కుమార్తెకు అనారోగ్యంగా ఉండటంతో ఈనెల ఐదున అంత హైదరాబాద్కు వెళ్లారు. తొమ్మిదో తేదీన వచ్చి చూసుకునే సరికి ఇంటి మొదటి అంతస్తు తాళాలు పగలుగొట్టి ఉన్నాయి. ఇంట్లో కవర్లో పెట్టిన బంగారు ఆభరణాలు కనిపించకుండాపోయాయి. భవానీపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఇది.
గుణదల ఆదర్శనగర్కు చెందిన కుటుంబం కానూరుకు వెళ్లింది. ఈనెల ఆరో తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఇంటి తాళాలు పగలుగొట్టి లోపల ఉన్న 840 గ్రాముల బంగారం, రూ.1.20 లక్షల నగదు దొంగిలించాడు. గుణదల పోలీస్స్టేషన్లో కొద్దిరోజుల క్రితం నమోదైన కేసు ఇది.
విజయవాడ రూరల్ మండలం నిడమానురుకు చెందిన వ్యక్తి హైదరాబాద్లో స్టీల్ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవలే సొంత గ్రామంలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈనెల తొమ్మిదిన ఫ్లాట్లోకి గృహప్రవేశం చేశారు. అంతా ఈ సందడిలో ఉండగా రామాలయం వీధిలో ఉన్న పాత ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. రూ.38 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకుపోయారు. పటమట పోలీస్స్టేషన్లో తాజాగా నమోదైన కేసు ఇది
విజయవాడలో దొంగలు చెలరేగుతున్నారనడానికి ఈ మూడు ఘటనలు ప్రత్యక్ష ఉదాహరణలు. వారం రోజులుగా నగరంలో ఇళ్లకు వేసి ఉన్న తాళాలు పగిలిపోతున్నాయి. బీరువాల తలుపులు పైకి లేచిపోతున్నాయి. ఇంటికి తాళం వేసి ఉందని కనిపిస్తే చాలు నేరగాళ్ల చేతులు ఇనుపరాడ్లు పట్టుకుంటున్నాయి. నగరం నిద్రపోతున్న వేళలో నేరగాళ్లు మేల్కొంటున్నారు. తాళాలు పగలుగొట్టి బంగారం, నగదు దోచుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చోరీలు ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. ఇంటికి తాళం వేసి పొరుగింటికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : నగరంలో వారం రోజులుగా జరుగుతున్న చోరీ కేసుల్లో ఒకదాన్ని పోలీసులు చేధించారు. గుణదల ఆదర్శనగర్లో జరిగిన కేసులో నిందితుడిని పట్టుకున్నారు. అతనే విజయవాడ వాంబేకాలనీలోని రాజరాజేశ్వరిపేటకు చెందిన కోన నాగ దుర్గామోహన్. అతడిని అరెస్టు చేశారు. అతడిపై మొత్తం 28 చోరీ కేసులున్నాయి. అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్లో కేడీ షీట్ ఉంది.
సత్యనారాయణపురం, భవానీపురం, పటమట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేరాలు చేసిన దొంగలు ఎవరన్నది తెలియడం లేదు. విజయవాడ నగరంలో ఉన్న పాత నేరగాళ్ల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి దొంగలు వచ్చి ఇక్కడ చోరీలు చేస్తున్నారన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలైన నేరగాళ్ల జాబితాను పరిశీలించారు. దీంతోపాటు అటు గుంటూరు, ఇటు పశ్చిమగోదావరి జిల్లాల జైళ్ల నుంచి బయటకు వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఒక్క భవానీపురం పీఎస్ పరిధిలోనే రెండు రోజుల్లో మూడు చోరీలు జరిగాయు. ఈ రెండు ఘటనల్లోనూ ఇంటి తాళాలు పగలుగొట్టి దొంగలు బంగారు వస్తువులను కాజేశారు.
నిడమానురు చోరీలో పొరుగు నేరగాడు
విజయవాడ రూరల్ మండలం నిడమానురులోని రామాలయం వీధిలో జరిగిన చోరీ వెనుక పొరుగు జిల్లా వాసి ఉన్నట్టు సమాచారం. స్టీల్ వ్యాపారి సుమంత్ ఇంట్లో ఉన్న రూ.38 లక్షల విలువ చేసే బంగారం, నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించిన విషయం తెలిసిందే. ఇక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు యువకులు ఇంటి ముందు రెక్కీ నిర్వహించినట్టు కనిపించింది. ఈ ఫుటేజీని సాంకేతికంగా విశ్లేషించిన తర్వాత ఒక నిందితుడ్ని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. చోరీ చేసిన వ్యక్తుల్లో ఒకరు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువకుడిగా అనుమానిస్తున్నారు. ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి మూడు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
సమాచారం ఇవ్వండి : విశాల్ గున్నీ, ఉప కమిషనర్
ప్రజలు వేసవి సెలవులకు ఊరు వెళ్తున్నా, తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తున్నా సంబంధిత పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. వారు తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎల్హెచ్ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) ను ఏర్పాటు చేస్తాం. దీంతోపాటు రాత్రిపూట బీట్ నిర్వహించే పోలీసులు ఆ ఇళ్ల వద్ద నిఘా పెడతారు.
వయస్సు 28... కేసులు 28
గుణదల చోరీ కేసును చేధించిన కాప్స్
నిందితుడిపై 28 కేసులు
విజయవాడ గుణదలలోని ఆదర్శనగర్లో ఉండే పాతూరు వెంకటరావు ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ చోరీతో ప్రమేయం ఉన్న నాగ దుర్గామోహన్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు డీసీపీ విశాల్ గున్నీ, సెంట్రల్ జోన్ ఏసీపీ భాస్కరరావు, గుణదల ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్తో కలిసి విజయవాడ ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివరాలను వెల్లడించారు. పాతూరు వెంకటరావు ఈనెల ఆరో తేదీన కుటుంబంతో కలిసి పోరంకిలో ఉన్న అత్తవారింటికి వెళ్లారు. ఇంటి వద్ద తల్లిని ఉంచారు. ఆమె తాళం వేసుకుని పక్కనే ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లారు. ఇంట్లో లైట్లు వేయమని పక్కన ఉన్న మహిళకు తాళం ఇచ్చారు. ఏడో తేదీన లైట్లు వేయడానికి వెళ్లగా తాళాలు తీసి ఉన్నాయి. లోపల సామాన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ఆమె వెంకటరావు తల్లికి విషయం చెప్పింది. ఆమె వెంకటరావుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. గుణదల ఇంటికి వచ్చారు. బీరువాలో ఉన్న 840 గ్రాముల బంగారం, రూ.లక్షా20 వేలు చోరీకి గురయ్యాయి. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఒక వ్యక్తి ఇనుపరాడ్డుతో ఇంటి ఆవరణలో తిరిగినట్టు కనిపించింది. దీనిపై గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు.
గుర్తించకుండా గుండు గీయించుకుని
చోరీ జరిగిన తర్వాత పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇది పాత నేరస్థుల పనిగా నిర్ధారణకు వచ్చారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన వారి జాబితాను పరిశీలించారు. అందులో వాంబేకాలనీ రాజరాజేశ్వరిపేటకు చెందిన కోన నాగ దుర్గామోహన్(28) పేరు కనిపించింది. దుర్గామోహన్ గుణదల, మాచవరం ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసుల్లో జైలుకు వెళ్లాడు. ఈ కేసుల్లో బెయిల్ రావడంతో 15 రోజుల క్రితం విడుదలయ్యాడు. గుణదల ప్రాంతంలో తిరుగుతుండగా పాతూరి వెంకటరావు ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించాడు. ఆరో తేదీన అర్ధరాత్రి ఇనుపరాడ్ తీసుకుని ఇంటి గోడ దాటాడు. సీసీ కెమెరాలు ఉండడంతో ముఖానికి మాస్క్ పెట్టుకుని లోపలకు దిగాడు. ఇంట్లో ఉన్న 840 గ్రాముల బంగారం, రూ.లక్షా20వేలు నగదు దొంగిలించిన తర్వాత న్యూరాజరాజేశ్వరిపేటలో ఉన్న ఇంటికి వెళ్లిపోయాడు. దుర్గామోహన్కు తల్లిదండ్రులు లేరు. వరుసకు అన్నయ్య అయ్యే చిన్నాన్న కుమారుడి వద్ద ఉంటున్నాడు. దొంగిలించిన సొత్తును ఆ ఇంట్లో భద్రపరిచాడు. సీసీ కెమెరాల్లో రికార్డు అయినా తనను పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ఏడో తేదీన కనకదుర్గ గుడికి వెళ్లి గుండు గీయించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సమయం చూసుకుని ఆ సొత్తుతో వైజాగ్కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు మొత్తం 20 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ ఇంట్లో చోరీ చేయడానికి ముందు ఐదో తేదీన పటమటలో ఒక అపార్టుమెంట్లో చోరీకి దిగాడు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో రామవరప్పాడు రింగ్ వద్దకు వచ్చాడు. ఫ్లైఓవర్ కిందన ఉన్న బడ్డీ కొట్టు తలుపులు పగలుగొట్టి అందులో ఉన్న 1000 సిగరెట్ పెట్టెలు దొంగిలించాడు. దుర్గామోహన్ను అరెస్టు చేసిన పోలీసులు 840 గ్రాముల బంగారం, రూ.1.20లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నగరంలో మొత్తం 28 చోరీలు కేసులు ఉన్నాయి. అజిత్సింగ్ నగర్ పోలీస్స్టేషన్లో కేడీ షీట్ ఉంది.
Updated Date - 2023-06-11T00:37:11+05:30 IST