వ్యాపారుల మాయ!
ABN, First Publish Date - 2023-05-24T01:24:17+05:30
ట్రేడర్లు, హోల్సేల్ వ్యాపారుల ధనదాహానికి, కక్కుర్తికి ప్రజలు బలవుతున్నారు. నిఘా వ్యవస్థలు నిద్రపోతున్నాయి. విజిలెన్స్, సివిల్ సప్లయీస్ సంస్థలు వ్యాపారుల గోడౌన్లను తనిఖీలు చేయటం మానేశాయి. ఇదే అదనుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మార్కెట్లో కొరత లేకపోయినా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఫలితంగా ధరలు ఇటీవల కాలంలో అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకునే నిత్యావసరాలే కాకుండా.. ప్రాంతీయంగా దిగుమతి చేసుకునే వాటిలో కూడా వ్యాపారులు ధరలను ఆమాంతం పెంచేస్తున్నారు.
పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ధరల కృత్రిమ పెంపు
పట్టించుకోని విజిలెన్స్, సివిల్ సప్లయీస్ విభాగాలు
బ్లాక్ మార్కెట్ను అరికట్టడంలో విఫలం
తనిఖీలు.. ఆకస్మిక దాడులు శూన్యం
ట్రేడర్లు, హోల్సేల్ వ్యాపారుల ధనదాహానికి, కక్కుర్తికి ప్రజలు బలవుతున్నారు. నిఘా వ్యవస్థలు నిద్రపోతున్నాయి. విజిలెన్స్, సివిల్ సప్లయీస్ సంస్థలు వ్యాపారుల గోడౌన్లను తనిఖీలు చేయటం మానేశాయి. ఇదే అదనుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మార్కెట్లో కొరత లేకపోయినా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఫలితంగా ధరలు ఇటీవల కాలంలో అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకునే నిత్యావసరాలే కాకుండా.. ప్రాంతీయంగా దిగుమతి చేసుకునే వాటిలో కూడా వ్యాపారులు ధరలను ఆమాంతం పెంచేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
భారీఎత్తున సరుకులు కొని నిల్వ చేసి బడా ట్రేడర్లు మార్కెట్ను శాసిస్తున్నారు. తెలివిగా ఎంపిక చేసుకుని ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన సరుకులకు ధరలు పెంచేస్తూ మార్కెట్లో కొరతగా అభివర్ణిస్తున్నారు. ట్రేడర్ల మాయాజాలంతో హోల్సేలర్లు, రీ టెయిలర్లు ఎవరి పరిధిలో వారు ఇదే అదనుగా భావించి ఒక్కొక్కరూ ఒక్కో రేటును నిర్ణయించి ప్రజల మీద భారం మోపుతున్నారు.
అన్నింటి ధరలూ ఆకాశంలోనే..
తాజాగా పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలపై ట్రేడర్లు టార్గెట్ పెట్టారు. కరోనా అనంతర పరిస్థితుల్లో పౌష్టికాహారంపై శ్రద్ధ పెంచి పప్పు ధాన్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆరోగ్యం కోసం సుగంధ ద్రవ్యాల వినియోగాన్ని కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ఈ రెండు కేటగిరీలపై ట్రేడర్లు దృష్టి సారించారు. మినుములు ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరే దిగుబడి ఉంది. కానీ మినుముల ధరలు పెరిగాయి. కేజీ రూ.90 నుంచి రూ.115కి పెరిగింది. కందిపప్పు మార్కెట్లో రూ.115 నుంచి రూ.140కు పెరిగింది. తాజాగా రూ.150 ధర పలుకుతోంది. రానున్న రోజుల్లో కందిపప్పు రూ.200కు కూడా చేరవచ్చునన్నది మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. సుగంధ ద్రవ్యాల విషయానికి వస్తే జీలకర్ర కేజీ రూ.250 నుంచి రూ.580కి పెరిగింది. అల్లం కేజీ రూ.60 ఉండగా.. రూ.220, రూ.230, రూ.240 చొప్పున విక్రయిస్తున్నారు. అల్లం బస్తా రూ.3 వేలు నుంచి రూ.12 వేలకు పెరిగింది. పంచదార కేజీకి రూ.5 మేర పెంచారు. మినపగుళ్లు మామూలువి రూ.100 ఉండేవి. ఇప్పుడు రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ ధరల పెరుగుదలకు సరైన హేతుబద్ధత లేదు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినా.. వారి అవసరాలు తప్పనివి కావటంతో.. వ్యాపారులు ఇంకా దోచుకోవటంపైనే దృష్టి సారిస్తున్నారు.
బయటి మార్కెట్పై దృష్టి సారించరా?
ప్రస్తుతం కందిపప్పు ధర బయటి మార్కెట్లో అసాధారణంగా పెరిగిపోయింది. చౌక డిపోల ద్వారా కందిపప్పును సబ్సిడీ మీద అందించాల్సి ఉంది. ఖర్చు కోణాన్ని దృష్టిలో ఉంచుకుని కందిపప్పు కోటాలో కోత విధిస్తోంది. కనీసం బయటి మార్కెట్లో కందిపప్పు ధరలు అసాధారణంగా ఉండకుండా అయినా సివిల్ సప్లయీస్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ పని కూడా సివిల్ సప్లయీస్ చేయటం లేదు. ఇటు విజిలెన్స్, అటు సివిల్ సప్లయీస్ కూడా వ్యాపారుల గోడౌన్లపై దాడులు చేయకపోవటం చూస్తే.. వ్యాపారుల నుంచి ప్రయోజనాలు పొందుతున్నారనుకోవాల్సి వస్తోంది.
పట్టించుకోని విజిలెన్స్, సివిల్ సప్లయీస్
టీడీపీ ప్రభుత్వంలో ధరలు చాలా వరకు స్థిరంగా ఉండేవి. ఎందుకంటే ఏదైనా నిత్యావసర ధరలు పెరిగాయంటే.. వెంటనే వాటిని తక్కువ ధరకు రైతుబజార్ల ద్వారా అందించే ప్రయత్నం చేసేది. ఇదే సందర్భంలో మార్కెట్లో లభ్యత ఉన్నా ఆ నిత్యావసర సరుకు ధర అమాంతంగా పెరిగితే.. వ్యాపారుల గోడౌన్లపై సంబంధిత శాఖలతో దాడులు చేయించేది. దీంతో వ్యాపారుల్లో ఒకింత భయం ఉండేది. ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి భయాలేవీ లేకపోవటంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిపోతోంది. విజిలెన్స్ గత నాలుగేళ్లుగా తన విధులు మరిచింది. సివిల్ సప్లయీస్కు అక్రమ నిల్వలపై దాడులు చేసే అధికారం ఉన్నా.. వారు ప్రజా పంపిణీకి సంబంధించిన వాటిపై తప్ప మిగిలిన వాటిపై దృష్టి సారించటం లేదు.
Updated Date - 2023-05-24T01:24:17+05:30 IST